ముంబై, ఫిబ్రవరి 14: దేశంలో పెరుగుతున్న ధరలు రిజర్వ్బ్యాంక్ సహనస్థాయికి పరీక్ష పెట్టాయి. తన సరళ పాలసీ మార్పునకు సహించదగ్గ గరిష్ఠస్థాయిగా నిర్దేశించుకున్న 6 శాతాన్ని రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో దాటేసింది. ముఖ్యంగా ఆహారోత్పత్తుల ధరలు పరుగులు తీయడంతో గత నెలలో వార్షిక ప్రాతిపదికన ఇది 6.01 శాతంగా నమోదయ్యింది. వినియోగ ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల 2021 డిసెంబర్లో 5.66 శాతంకాగా, 2021 జనవరిలో 4.06 శాతం. ద్రవ్యోల్బణాన్ని 2 శాతం అటూఇటూగా 4 శాతం వద్ద అదుపు చేయాలని (అంటే గరిష్ఠంగా 6 శాతం, కనిష్ఠంగా 2 శాతం) కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్బీఐకి లక్ష్యంగా నిర్ణయించింది. సోమవారం జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం జనవరి నెలలో ఇది నిర్దేశిత సహనస్థాయిని మించిపోయింది.
ఆందోళన అనవసరం: శక్తికాంత దాస్
జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరడం ఆందోళనకారకం కాదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ బోర్డ్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది జనవరిలో…లో బేస్ కారణంగా ఈ జనవరిలో అధికంగా కన్పిస్తున్నదన్నారు. వాస్తవానికి అక్టోబర్ నెల నుంచి చూస్తే ద్రవ్యోల్బణం కదలిక దిగువముఖంగానే ఉన్నదన్నారు. బేస్ ఎఫెక్ట్ ఫలితంగా గణాంకాల కోణంలో చూస్తే పెరిగినట్టు కన్పిస్తున్నదన్నారు. రానున్న నెలల్లో ఈ బేస్ ఎఫెక్ట్ వివిధ మార్గాల్లో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయని హెచ్చరించారు.
ఇంకా రెండంకెల్లోనే టోకు ధరల సూచీ
ప్రస్తుత ఏడాది జనవరి నెలలో టోకు ధరల పెరుగుదల రెండెంకల్లోనే కొనసాగింది. 2021 డిసెంబర్లో నమోదైన 13.56 శాతంతో పోలిస్తే జనవరిలో 12.96 శాతానికి టోకు ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, వరుసగా పదో నెలలోనూ ఈ ధరల వృద్ధి 10 శాతం ఎగువనే కొనసాగడం గమనార్హం.
పెరిగిందిలా..