న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడిన క్రమంలో భారత్లో డోలో-650 వాడకం విపరీతంగా పెరగడంపై చర్చ ఊపందుకోగా భారత్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగంపై తాజా అధ్యయనం ఆందోళన రేకెత్తిస్తోంది. 2019లో భారతీయులు రూ 500 కోట్ల విలువైన యాంటీబయాటిక్స్ను వాడగా ఇందులో అజిత్రోమైసిన్ వాడకం ముందువరసలో నిలిచింది. యాంటీబయాటిక్స్ విక్రయం, వాడకంపై నూతన నియంత్రణలతో పాటు ప్రస్తుత నిబంధనలను కఠినతరం చేయాలని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగం భారత్లో యాంటీబయాటిక్స్ నిరోధకతను తగ్గిస్తుందని జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. దుకాణాల్లో సులభంగా పలు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండటంతో వీటి విక్రయాలు, లభ్యత పెరుగుతోందని పేర్కొంది. భారత్ అతిపెద్ద యాంటీబయాటిక్ వినియోగదారుగా ఉన్నప్పటికీ అమెరికా, యూరప్ తరహాలో యాంటిబయాటిక్ వాడకంపై నిఘా, నియంత్రణకు సంబంధించి సమర్ధ వ్యవస్ధ, యంత్రాగం కొరవడిందని అధ్యయన పత్రంలో పరిశోధకులు పేర్కొన్నారు.
భారత్లో యాంటీబయాటిక్స్ వాడకంలో అత్యధికంగా అజిత్రోమైసిన్ను వాడగా, ఆ తర్వాత సెఫిక్సిమ్ 200 ఎంజీ ట్యాబ్లెట్ను అధికంగా వాడారని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమాలజీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పరిశోధకులు వెల్లడించారు. భారత్లో విస్తృతంగా అత్యధికంగా యాంటీబయాటిక్స్ వాడకం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుందని అధ్యయన పత్రంలో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.