Ramnath Kovind | దేశీయ ఐటీ రంగంలో స్టార్టప్లు ఆరు లక్షల మందికి పైగా ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 2016 నుంచి 56 రంగాల్లో 60 వేల స్టార్టప్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. భారత యువత సారధ్యంలో నూతన అవకాశాలు అనంతం అని మన స్టార్టప్ పరిశ్రమ రుజువు చేసిందన్నారు. ఈ స్టార్టప్ల్లో ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగాలు లభించాయన్నారు.
కరోనా మహమ్మారి వేళ 2021లో 40కి పైగా స్టార్టప్లు ఆవిర్భవించాయని, వాటిల్లో ఒక్కో స్టార్టప్ కనీస మార్కెట్ విలువ రూ.7,400 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) అని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. నాస్కామ్-జిన్నోవ్ నివేదిక ప్రకారం 2021లో ఇండియన్ స్టార్టప్లు ఈ నెలలో 24.1 బిలియన్ల డాలర్ల నిధులు సేకరించాయి. ప్రీ-కోవిడ్ స్థాయికి ఇది రెండు రెట్లు ఎక్కువ. 11 స్టార్టప్ సంస్థలు ఐపీవోల ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి ఆరు బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకున్నాయి.
భారత్ టెక్ స్టార్టప్ పునాది నికర వృద్ధిరేటుకు నిదర్శనంగా నిలిచింది. 2020లో 600కి పైగా స్టార్టప్లు ఉంటే, 2021లో 2250కి చేరుకున్నాయి. 2021లో 18 రంగాల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 42 స్టార్టప్లు జత కలిశాయి. అమెరికా, చైనా తర్వాత స్టార్టప్ల మార్కెట్ వాల్యుయేషన్లో భారత్ స్టార్టప్ల విలువ సుమారు 90 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే భారత్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఖర్చు, స్మార్ట్ఫోన్ల ధరలు ప్రపంచంలోకెల్లా చౌకగా ఉన్నాయని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఇది భారత యువతరానికి భారీగా లబ్ధి చేకూరుస్తుంది. భారత్ ప్రస్తుతం 5జీ మొబైల్ కనెక్టివిటీ కోసం పని చేస్తుందని, దీనివల్ల కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు.