బాన్ చాంగ్ (థాయ్లాండ్): ఆసియా రోయింగ్ చాంపియన్షిప్లో భారత సీనియర్ రోవర్ అర్వింద్ సింగ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. థాయ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల స్కల్స్ ఫైనల్ రేసును అర్వింద్ 7 నిమిషాల 55.942 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు పోటీల ఆఖరి రోజు భారత్ ఖాతాలో మరో మూడు రజతాలు చేరాయి. డబుల్ స్కల్స్లో ఆశిష్ ఫుగట్-సుఖ్జిందర్ సింగ్ ద్వయం (7:12.568 సెకన్లు).. పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్లో బిట్టు సింగ్, జకర్ ఖాన్, మంజిత్ కుమార్, సుఖ్మీత్ సింగ్ బృందం (6:33.661 సెకన్లు).. పురుషుల కాక్స్లెస్ విభాగంలో జస్వీర్ సింగ్, పునీత్ కుమార్, గుర్మీత్ సింగ్, చరణ్జిత్ సింగ్ జట్టు (6:51.661 సెకన్లు) తమ తమ విభాగాల్లో రెండో స్థానాల్లో నిలిచి రజత పతకాలు చేజిక్కించుకున్నాయి. దీంతో భారత్ 6 పతకాల (2 స్వర్ణాలు, 4 రజతాలు)తో ఈ టోర్నీని ముగించింది. శనివారం జరిగిన పోటీల్లో భారత జోడీ అర్జున్-రవి స్వర్ణం చేజిక్కించుకోగా.. పర్మిందర్ సింగ్ రజతం నెగ్గిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన రోవర్లను అభినందించిన భారత రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎమ్వీ శ్రీరామ్.. జాతీయ కోచ్, హైదరాబాదీ ఇస్మాయిల్ బేగ్ కృషిని కొనియాడారు.