తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఏండ్లుగా చేస్తున్న ప్రతిపాదనలు, వినతులు బుట్టదాఖలవుతున్నాయి. కొత్త లైన్ల కోసం సర్వేలు చేసి నివేదికలు పంపి ఎదురుచూపులు చూడటమేగానీ రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి మంజూరులు, కేటాయింపులు జరగడం లేదు.
2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరడం, అదే సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఏర్పడటం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎనిమిదేండ్లుగా ఒక్క కొత్త రైల్వే లైను కూడా రాష్ర్టానికి మంజూరు కాలేదు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కొత్తలైన్లు ఏ రాష్ర్టానికీ మంజూరు చేయలేదంటూ కేంద్రం చేతులు దులుపుకొంటున్నది. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,121 కి.మీ. రైల్వేలైన్ మాత్రమే ఉన్నది. ఇక్కడ రైల్వే వాళ్లు సాంకేతికంగా రైల్వే లైన్లన్నింటినీ రూట్ కిలోమీటర్లుగా చూపి లెక్క పెంచుతున్నారు! సింగిల్, డబుల్, ట్రిపుల్.. ఇలా ఎన్ని లైన్లు ఉంటే అన్నింటినీ కలిపి చూపిస్తున్నారు. తెలంగాణలో సింగిల్ లైన్ 1,121 కి.మీ, డబుల్ లైన్ 671కి.మీ, ట్రిపుల్ లైన్ 77 కి.మీ ఇలా మొత్తం 1,869 కి.మీ. రూట్ ఉన్నదని రైల్వేశాఖ చెబుతున్నది. అంటే రాష్ట్రంలో కేవలం 1,121కి.మీ. మాత్రమే వివిధ ప్రాంతాలతో అనుసంధానమై ఉన్నట్లు లెక్క. లైను పొడవును లెక్కించటానికి సింగిల్ లైన్ ఉన్నదే లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే డబుల్, ట్రిపుల్ లైన్లు కొత్త ప్రాంతాలను అనుసంధానించవు. రైల్వే లైన్ ఉన్నచోటే రద్దీకి అనుగుణంగా డబుల్, ట్రిపుల్ లైన్లు వేస్తుంటారు. కానీ ఈ విషయాన్ని మాయ చేసి చెబుతున్నారు. అందువల్ల రైల్వే నెట్ వర్క్ గణాంకాలు పెరుగుతున్నాయి.
తెలంగాణలో ఉన్న సింగిల్ లైన్ 1,121 కి.మీ.కు తోడుగా నిర్మాణంలో ఉన్న ఎనిమిది కొత్త లైన్ల నిడివి 656 కి.మీ.ను త్వరితగతిన పూర్తి చేస్తే 1,777 కి.మీ.గా మారుతుంది. అప్పుడు రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు కొంత పెరిగినట్టు అవుతుంది. విచిత్రమేమంటే ఈ ఎనిమిదేండ్లుగా నిర్మాణంలో ఉన్న 656 కి.మీ. ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్రం తనవంతు వాటా నిధులు ఇవ్వడం లేదని సీఎంకు లేఖ రాశారు. అదీ టీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని నిలదీస్తుంటే ఆయన స్పందించారు. ఇంతకాలం బీజేపీ ఎంపీలు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు నిధులను ఎందుకు ఇప్పించుకోలేక పోయారు? కనీసం మాట వరుసకైనా అడిగారా అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టుల గురించి టీఆర్ఎస్ నేతలు నిలదీయగానే, సాకులు వెతకటం తప్ప మరేమీ కాదు.
రాష్ట్రంలో కొత్త లైన్ల నిర్మాణం కోసం సర్వేలు జరిగి ఏండ్లు గడిచిపోతున్నాయి. వీటన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టేసింది. కారణం ఇవన్నీ లాభదాయకం కాదని అంటున్నది. పైగా కొత్త వాటిని మంజూరు చేయరాదనేది విధానపరమైన నిర్ణయంగా పెట్టుకున్నామని, నిర్మాణం లో ఉన్న వాటినే పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నామని రైల్వే శాఖ చెబుతున్నది. మరి తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ ఈ ఎనిమిదేండ్లలో ఎందుకు పూ ర్తి చేయలేదన్నది ప్రశ్న. కొత్తలైన్లు రావడం లేదు, నిర్మాణంలో ఉన్నవి పూర్తికావడమూ లేదు.
తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. వీటిలో 14 జిల్లాలకు మాత్రమే రైల్వేలైన్ సౌకర్యం ఉన్నది. కొత్త జిల్లాలకు అనుసంధానత కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖకు ఉన్నది. రైల్వే బోర్డుకు సర్వేల నివేదికలు చేరినా అన్నింటినీ పక్కన పెడుతున్నది. తెలంగాణ ఆవిర్భావం నుంచి 11 కొత్త రైల్వే లైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ రైల్వే మంత్రికి లేఖ కూడా రాశారు.
దీంతోపాటే కొన్నేండ్ల కిందట సర్వేలు పూర్తి చేసుకున్న 25 లైన్లను తొక్కిపట్టారని ఆక్షేపించారు. అదేవిధంగా విభజన చట్టంలో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయించాలని ఉన్నా, ఇంతవరకు పట్టించుకోలేదు. రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీయాలంటే రైల్వేలైన్ల నిర్మాణం కీలకం. దీన్ని కేంద్ర పాలకులు పట్టించుకుంటేనే సాధ్యం.
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఎనిమిది ప్రాజెక్టుల్లో మనోహరాబాద్-కొత్తపల్లి (151 కి.మీ) లైను ఇంతవరకు తొలిదశను కూడా పూర్తి చేసుకోలేదు. అతి చిన్న నిడివి ఉన్న అక్కన్నపేట్-మెదక్ (17 కి.మీ.) కూడా పూర్తి కాలేదు. భద్రాచలం రోడ్-సత్తుపల్లి(56 కి.మీ) మార్గం పనులు మాత్రం చురుకుగా సాగుతున్నాయి. మునీరాబాద్- మహబూబ్నగర్ లైనును రాష్ట్రంలో దేవరకద్ర-కృష్ణ వరకు పూర్తి చేయాల్సి ఉంది. అయితే మఖ్తల్ వరకు వచ్చి ఆగింది. భద్రాచలంరోడ్-కొవ్వూరు, మణుగూరు-రామగుండం, కొత్తగూడెం-కొండపల్లి, నల్గొండ-మాచర్ల మార్గాలను త్వరితగతిన పూర్తి చేయడంపై రైల్వేశాఖ శ్రద్ధ చూపాలి. ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా నిధులు కేటాయించడంపై మన రైల్వే లైన్ల నిర్మాణం ఆధారపడి ఉన్నది.
కె.బాలకిషన్ రావు
99665 54945
( సీనియర్ జర్నలిస్ట్)