Indian Post | ఒకప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమైన తపాలా శాఖ సేవలు రోజురోజుకూ ప్రజల చెంతకు చేరుతున్నాయి. అందులో భాగంగా పలు స్కీములను ఆన్లైన్ ద్వారా వినియోగదారులు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే రూ. 399లతో రూ. 10లక్షల బీమా, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్, కిసాన్ వికాస్ పత్రం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మంత్లీ ఇన్కమ్ స్కీం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, టైమ్ డిపాజిట్స్ స్కీం, రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్స్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలు పొందుతోంది పోస్టల్ శాఖ. తాజాగా మరో అడుగు ముందుకేసి పోస్టాఫీసుల్లో ఖాతా తెరువాలనుకునే వారు కార్యాలయానికి రాకుండానే ఇంటి వద్దే ఆన్లైన్లో పోస్టల్ ఖాతా చేసుకొనే అవకాశం కల్పించింది. ఇందుకుగాను ప్రత్యేకంగా ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్ను రూపొందించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 18002666868ను ఏర్పాటు చేసినట్లు పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు.
పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి వద్దే ఖాతా ఓపెన్ చేయాలనుకునే వారు ముందుగా సెల్ఫోన్లో ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఖాతా తెరిచేందుకు అవసరమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి సర్వీస్ రిక్వెస్ట్ రిజిస్టర్ చేసుకొని పంపించాలి. ఎవరి పేరున పోస్టాఫీసులో ఖాతా తెరువాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్తో పాటు పాస్పోర్టు ఫొటోలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తపాలా సిబ్బందే ఇంటి కొచ్చి ఖాతా తెరిపిస్తారు. ఈ యాప్ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే అవకాశం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు.
యాప్లో వివరాలు నమోదు చేసిన తర్వాత పోస్టల్ ఉద్యోగులు మీ ఇంటికి వస్తారు. అకౌంట్ తెరిచేందుకు అవసరమైన దరఖాస్తు ఫారాన్ని పూరించడంలో సహకరిస్తారు. అనంతరం ఫారం, డబ్బులు తీసుకుని పోస్టాఫీసులో అందజేస్తారు. ఆ తర్వాత ఖాతా బుకును సైతం మీ ఇంటికే వచ్చి ఇస్తారు. ఈ సేవలకు పోస్టల్ శాఖ వారు ఎలాంటి అదనపు రుసుము తీసుకోరు. ఇప్పటికే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ఉన్న ఖాతాదారు లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో రికరింగ్ డిపాజిట్, టైం డిపాజిట్ (ఫిక్స్డ్ డిపాజిట్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలాగే ఈ-పాస్బుక్ ద్వారా ఖాతాజమ లావాదేవీలు చూసుకునే వెసులుబాటు కల్పించింది. పోస్టల్ శాఖకు చెందిన మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 18002666868ను సంప్రదించవచ్చు.
హనుమకొండ డివిజన్ పరిధిలో హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు వస్తాయి. వీటి పరిధిలో మూడు హెడ్ పోస్టాఫీసులు, 49 సబ్ పోస్టాఫీసులు, 414 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉండగా, వీటిలో సేవలను పొందవచ్చు.
తపాల శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నడుం బిగించింది. ఇప్పటికే వివిధ రకాల పథకాలు అమలు చేస్తోంది. తాజాగా ఆన్లైన్ విధానంతో ఇంటి వద్ద నుంచే ఖాతా ఓపెన్ చేసేందుకు ప్రత్యేకంగా ‘పోస్ట్ ఇన్ఫో’ (POST INFO) యాప్ను రూపొందించింది. ఈ యాప్లో సర్వీస్ రిక్వెస్ట్ పెట్టగానే సిబ్బంది వచ్చి, అందుకు సంబంధించిన పత్రాలు తీసుకొని ఖాతా ఓపెన్ చేస్తారు. అనంతరం ఖాతా బుక్ను ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– బీ నందానాయక్, పోస్టల్ సూపరింటెండెంట్, హనుమకొండ డివిజన్