ముంబై, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవీబీ) లాభాలు రెండు రెట్లు పెరిగాయి. మొండి బకాయిల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం, నగదు రికవరీ గరిష్ఠ స్థాయిలో ఉండటంతో గత త్రైమాసికానికిగాను రూ.454 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.213 కోట్లతో పోలిస్తే 113 శాతం అధికమని పేర్కొంది. గత త్రైమాసికంలో వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.4,198 కోట్లకు పడిపోగా, నికర వడ్డీ మార్జిన్ 2.45 శాతం నుంచి 2.40 శాతానికి దిగొచ్చింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 12.19 శాతం నుంచి 10.45 శాతానికి, నికర ఎన్పీఏ 3.13 శాతం నుంచి 2.63 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,073 కోట్ల నిధులను కేటాయించగా..రూ.1,199 కోట్ల నగదు రికవరీ అయినట్లు తెలిపారు.