స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా
బాధ్యతలు చేపట్టాక టీమ్ఇండియా వరుసగా మూడో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. రెండో టీ20కి యాక్షన్ రీప్లేలా సాగిన ఆఖరి పోరులో రోహిత్ సేన విజృంభించింది. మొదట పేసర్లు సత్తాచాటడంతో లంకేయులు తక్కువ పరుగులకే పరిమితం కాగా..శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ ఫిఫ్టీతో ఛేదనను సులభతరం చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాలనుకున్న మేనేజ్మెంట్కుఈ సిరీస్ ఇతోధిక సాయం చేయగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వచ్చే నెల 4 నుంచి లంకతో టీమ్ఇండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సమాయత్తమవుతున్నది!
ధర్మశాల: స్వదేశంలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా.. మరో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. కరీబియన్లను వన్డే, టీ20ల్లో చిత్తు చేసిన రోహిత్ సేన.. శ్రీలంకకు కూడా అదే శిక్ష వేసింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ నెగ్గిన భారత్.. 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. హిమగిరుల మధ్య ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక (38 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించగా.. నిషాంక (1), గుణతిలక (0), అసలంక (4), జనిత్ (9) విఫలమయ్యారు. ఒక దశలో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంకకు.. చండిమాల్ (22), చమిక కరుణరత్నె (12) సాయంతో షనక పోరాడే స్కోరు అందించాడు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం కష్టతరం కాని లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా.. 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73; 9 ఫోర్లు, ఒక సిక్సర్) వరుసగా మూడో అర్ధశతకం సాధించగా.. రవీంద్ర జడేజా (22 నాటౌట్), దీపక్ హుడా (21) అతడికి సహకరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. గత మ్యాచ్ మాదిరిగానే శ్రేయస్ యాంకర్ రోల్ పోషిస్తూ జ ట్టును విజయతీరాలకు చేర్చాడు. మిడిలార్డర్లో చోటు కోసం సూర్యకుమార్తో పోటీ పడుతున్న శ్రేయస్ హ్యాట్రి క్ అర్ధశతకాలతో జట్టు నుంచి తనను తప్పించలేని పరిస్థితి కల్పించాడు. అతడికే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి మొహాలీ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
శ్రీలంక: 20 ఓవర్లలో 146/5 (షనక 74 నాటౌట్; అవేశ్ ఖాన్ 2/23, సిరాజ్ 1/22), భారత్: 16.5 ఓవర్లలో 148/4 (శ్రేయస్ 73 నాటౌట్, జడేజా 22 నాటౌట్; లహిరు 2/39).