IND vs NZ : ఇండియా, న్యూజిలాండ్ మధ్య హమిల్టన్లో జరుగుతున్న రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండుసార్లు వరుణుడు మ్యాచ్కు ఆటంకం కలిగించాడు. దాంతో, ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేద్దామనుకున్న భారత జట్టుకు నిరాశే మిగిలింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. 4.5 ఓవర్ల ఆట తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ని నిలిపి వేశారు. అప్పటికీ భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులకు చేసింది.
వర్ష సూచన ఉండడంతో అంపైర్లు మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ధావన్ (3 పరుగులు) చేసి ఔట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడాడు. కానీ, 12.5 ఓవర్ల తర్వాత మళ్లీ చినుకులు మొదలలవ్వడంతో మ్యాచ్ని నిలిపి వేశారు. సూర్యకుమార్ యాదవ్ 34, ఓపెనర్ శుభ్మన్ గిల్ 45 పరుగులతో నాటౌట్గా నిలిచారు. వర్షం తగ్గే అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. మొదటి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే బుధవారం హగ్లే ఓవల్ స్టేడియంలో జరగనుంది.