వాషింగ్టన్ : కరోనా అంతం విషయంలో తప్పుడు లెక్కలు వేయడంతోనే భారత్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. కరోనా అంతమైందన్న తప్పుడు అభిప్రాయంతో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతోనే ప్రస్తుతం పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన సెనేట్ హెల్త్, ఎడ్యూకేషన్, లేబర్ పెన్షన్ కమిటీకి కొవిడ్పై విచారణ సందర్భంగా చెప్పారు. ముఖ్యమైన విషయాల్లో పరిస్థితి ఎప్పుడు తక్కువగా అంచనా వేయొద్దని భారత్లో రెండో దశ విలయం ద్వారా ప్రపంచానికి అర్థమవుతుందన్నారు.
భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధతపై తెలుసుకోవచ్చునని, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటూ వెళ్లాలని అవసరాన్ని సైతం నొక్కి చెబుతుందన్నారు. ప్రపంచ మహమ్మారులపై పోరాటంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పోరాటం చేయలేదని.. ప్రపంచ దేశాలన్ని ఏకమై బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఏ దేశంలో వైరస్ ఆనవాళ్లు మిగిలి ఉన్నా.. తిరిగి ప్రపంచం మొత్తం విస్తరించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.