సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలు మజాను మరోసారి రుచిచూపిన భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఆఖరి రోజు మన స్పిన్నర్లు విశ్వరూపం కనబరుస్తారనుకుంటే.. ప్రత్యర్థి టెయిలెండర్లు అంతకుమించిన పోరాటంతో మ్యాచ్ను గట్టెక్కించారు. ఓటమి అంచుల్లో కూరుకుపోయిన జట్టును.. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అసమాన ప్రదర్శనతో పోటీలోకి తెచ్చారు. తొలి సెషన్ మొత్తం ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు.. ఆఖరికి వచ్చేసరికి తొమ్మిది వికెట్లు పడగొట్టినా.. తోక తెంపడంలో విఫలమవడంతో విలియమ్సన్ సేన ఊపిరి పీల్చుకుంది. ‘భారతీయులే స్పిన్ను సమర్థవంతంగా ఆడగలరనే’ నమ్మకాన్ని నిజం చేస్తూ.. భారత సంతతికే చెందిన రచిన్, అజాజ్ పోరాట స్ఫూర్తి కనబర్చడం విశేషం!
కాన్పూర్: స్పిన్నర్లు సత్తాచాటినా.. టెయిలెండర్లు మొండిగా పోరాడటంతో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. భారత పిచ్లపై ఆఖరి రోజు స్పిన్నర్లు మెరువడం పరిపాటే అయినా.. ఈసారి అందుకు భిన్నంగా ప్రత్యర్థి జట్టులోని భారత సంతతి స్పిన్నర్లు బ్యాట్లతో ఓటమికి ఎదురు నిల్చారు. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు సమంగా నిలిచాయి. 284 పరుగుల లక్ష్యఛేదనలో 4/1తో సోమవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరికి 98 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
రోజంతా బౌలింగ్ చేసిన మనవాళ్లు మరో 8 వికెట్లు పడగొడితే.. మ్యాచ్ను ‘డ్రా’ చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన కివీస్ 564 బంతులెదుర్కొని ఆలౌట్ కాకుండా నిలిచింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52) టాప్ స్కోరర్ కాగా.. నైట్ వాచ్మన్ విలియమ్ సోమర్విల్లె (110 బంతుల్లో 36), కేన్ విలియమ్సన్ (112 బంతుల్లో 24), రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో హాఫ్సెంచరీతో రాణించిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముంబై వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
అసమాన పోరాటం
విజయానికి తొమ్మిది వికెట్లు పడగొట్టాల్సిన స్థితిలో ఆట ప్రారంభించిన టీమ్ఇండియాకు.. అది అంత సులువు కాదనే విషయం తొలి సెషన్లోనే తెలిసొచ్చింది. నైట్వాచ్మన్గా క్రీజులోకి వచ్చిన సోమర్విల్లె అచ్చమైన టెస్టు ఆటగాడిలా దుర్భేద్యమైన డిఫెన్స్తో ఆకట్టుకుంటే.. మరో ఎండ్లో లాథమ్ ఓవర్లు కరిగించే పనిలో పడ్డాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 194 బంతుల్లో 76 పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్ లంచ్ సమయానికి 79/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో ఫలితం తేలడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. ఉమేశ్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత తీసుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ తనను ప్రపంచస్థాయి ఆటగాడని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు.
వికెట్ల ముందు అడ్డుగొడలా నిలిచిన కేన్.. ఉమేశ్ యాదవ్ వేసిన ఓ డెడ్లీ యార్కర్ను ఎదుర్కొన్న తీరు చూసి తీరాల్సిందే! భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ జోడీ 116 బంతుల్లో 39 పరుగులు జోడించాక అశ్విన్.. లాథమ్ను ఔట్ చేశాడు. కాసేపటికే రాస్ టేలర్ (24 బంతుల్లో 2) కూడా ఔటవడంతో.. టీ సమయానికి కివీస్ 125/4తో నిలిచింది. ఆఖరి సెషన్ ఆరంభంలోనే హెన్రీ నికోల్స్ (1), విలియమ్సన్, టామ్ బ్లండెల్ (38 బంతుల్లో 2), కైల్ జెమీసన్ (30 బంతుల్లో 5) వికెట్లు పడటంతో భారత్ గెలుపు ఆశలు చిగురించగా.. రచిన్ రవీంద్ర తన పోరాటంతో టీమ్ఇండియా విజయాన్ని అడ్డుకున్నాడు. 15 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచిన అతడు అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్)తో కలిసి వికెట్ పడకుండా ఆటను ముగించాడు.
విజయం కోసం చివరి వరకు శ్రమించాం. వెలుతురును దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాం. క్లిష్టమైన తొలి సెషన్ తర్వాత మేం తిరిగి పుంజుకోవడం ఆనందాన్నిచ్చింది. మా స్పిన్నర్లు సుదీర్ఘ స్పెల్స్తో ఆకట్టుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కివీస్ బ్యాటర్లు చక్కటి పోరాటం కనబర్చారు. అందుకే మ్యాచ్లో ఫలితం తేలలేదు. మేము ఇంతకన్నా వేరే ఏదైనా ప్రయత్నించి ఉండాల్సిందని అనుకోను. శ్రేయస్ చక్కటి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. టెస్టు జట్టులో చోటు కోసం అతడు సుదీర్ఘ కాలం వేచిచూశాడు. తదుపరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టుతో చేరుతాడు. తుది జట్టు ఎంపిక విషయం మేనేజ్మెంట్ చూసుకుంటుంది.
-అజింక్యా రహానే, భారత కెప్టెన్
ఆఖరి రోజు ఆట ఆరంభానికి ముందు మూడు ఫలితాలకు అవకాశం కనిపించింది. కఠినమైన పరిస్థితుల్లో మావాళ్లు పోరాడారు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్, సోమర్విల్లేకు ఇది మరపురాని మ్యాచ్. పేసర్లు కూడా చక్కగా రాణించారు. సౌథీ, జెమీసన్ విశ్రాంతి లేకుండా సుదీర్ఘ స్పెల్స్తో ఆకట్టుకున్నారు. భారత్ బలమైన జట్టని మాకు తెలుసు. ముంబైలో ఇంతకు భిన్నమైన పిచ్ ఎదురవుతుందని భావిస్తున్నాం.
-కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 345; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296; భారత్ రెండో ఇన్నింగ్స్: 234/7 డిక్లేర్డ్; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బి) అశ్విన్ 52, విల్ యంగ్ (ఎల్బీ) అశ్విన్ 2, సోమర్విల్లె (సి) గిల్ (బి) ఉమేశ్ 36, విలియమ్సన్ (ఎల్బీ) జడేజా 24, టేలర్ (ఎల్బీ) జడేజా 2, నికోల్స్ (ఎల్బీ) అక్షర్ 1, బ్లండెల్ (బి) అశ్విన్ 2, రచిన్ (నాటౌట్) 18, జెమీసన్ (ఎల్బీ) జడేజా 5, సౌథీ (ఎల్బీ) జడేజా 4, అజాజ్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు: 17, మొత్తం: 98 ఓవర్లలో 165/9. వికెట్ల పతనం: 1-3, 2-79, 3-118, 4-125, 5-126, 6-128, 7-138, 8-147, 9-155, బౌలింగ్: అశ్విన్ 30-12-35-3, అక్షర్ 21-12-23-1, ఉమేశ్ 12-2-34-1, ఇషాంత్ 7-1-20-0, జడేజా 28-10-40-4.