India-France Meet 2026 : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఫ్రాన్స్లో చదివేందుకు భారతీయ విద్యార్థులకు అవకాశాలు మెరుగవ్వనున్నాయి. 2030 నాటికి అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 30,000కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 10,000గా ఉంది.
అంటే రాబోయే నాలుగేళ్లలో మరో 20,000 పెంచాలని భావిస్తున్నారు. దీని ద్వారా మన విద్యార్థులకు సులభంగా ఫ్రెంచ్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులకు అవకాశాలు వస్తాయి. మన విద్యార్థుల కోసం ముంబైలో అకడమిక్ హబ్ కూడా ఏర్పాటు చేస్తుంది ఫ్రాన్స్. అలాగే ఇరు దేశాల డిగ్రీలను రెండు దేశాలు అంగీకరించే అంశంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. అలాగే భారతీయులకు ఫ్రాన్స్ ఉచిత వీసా అందిస్తుంది. అలాగే ఫ్రాన్స్ ద్వారా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులు కూడా ఫ్రాన్స్కు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. అయితే, దీన్ని మొదటి ఆరు నెలలు పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు. ఆ తర్వాత సమీక్షించి పూర్తిస్థాయిలో అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ఇరు దేశాల మధ్య 21 అంశాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, హెల్త్కేర్, డెవలప్మెంట్, కల్చరల్, రక్షణ, ఎడ్యుకేషన్, ట్రేడింగ్, డిజిటల్ పేమెంట్స్, అంతర్జాతీయ దౌత్య సేవలు, సహజ వనరులు వంటి అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇండియా – ఫ్రాన్స్ మధ్య 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రూ.3.25 లక్షలతో ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది. ఇప్పటికే మన దగ్గర 36 రాఫెల్ విమానాలున్నాయి. ఇక ఈ డీల్ భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్దది.