జ్ఞానేశ్వరికి రజతం, రితికకు కాంస్యం
న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు జోరు కనబరుస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే హర్షద శరద్ స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించగా.. తాజాగా మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. జ్ఞానేశ్వరి యాదవ్ రజతం, రితిక కాంస్యం కొల్లగొట్టారు. గ్రీస్ వేదికగా జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ మెగాటోర్నీలో మంగళవారం జ్ఞానేశ్వరి 49 కిలోల విభాగంలో మొత్తం 156 కిలోలు (73+83) ఎత్తి రెండో స్థానంలో నిలువగా.. రితిక 150 కిలోలు (69+81) ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విండీ కంటిక ఐషా (ఇండోనేషియా) మొత్తం 185 కిలోలు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకుంది.