ఓపెనర్లు స్మృతి మందన, షఫాలీ వర్మ దూకుడుకు.. మిడిలార్డర్లో మిథాలీరాజ్, హర్మన్ప్రీత్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన భారత మహిళల జట్టు.. ఒకే ఒక్క నోబాల్తో మహిళల వన్డే ప్రపంచకప్లో నాకౌట్కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. దక్షిణాఫ్రికా విజయానికి చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన దశలో.. అప్పటికే అర్ధశతకంతో జట్టును విజయానికి చేరువ చేసిన డు ప్రెజ్ క్యాచ్ ఔట్ అయింది. అయితే దీప్తి శర్మ వేసిన ఆ బంతి నోబాల్ కావడం మనవాళ్ల ఆశలపై నీళ్లు కుమ్మరించింది!
క్రైస్ట్చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత అమ్మాయిలకు నిరాశ ఎదురైంది. నాకౌట్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో మిథాలీరాజ్ బృందం చివరి బంతికి పరాజయం పాలైంది. ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ (68), స్మృతి మందన (71), షఫాలీ వర్మ (53) అర్ధశతకాలతో విజృంభించగా.. హర్మన్ప్రీత్ కౌర్ (48) ఆకట్టుకుంది.
అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా సరిగ్గా 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసింది. సఫారీల విజయానికి చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ వేసిన ఐదో బంతికి డు ప్రెజ్ (52 నాటౌట్) క్యాచ్ ఔటైనా.. అది నోబాల్ కావడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. లౌరా వాల్వర్ట్ (80), లారా గోడాల్ (49) రాణించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డు ప్రెజ్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. భారత బౌలర్లలో హర్మన్ప్రీత్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుధవారం జరుగనున్న తొలి సెమీస్లో వెస్టిండీస్తో ఆస్ట్రేలియా.. గురువారం రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 274/7 (స్మృతి 71, మిథాలీ 68, షఫాలీ 53; మసాబటా క్లాస్ 2/38, షబ్నమ్ 2/42), దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 275/7 (వాల్వర్ట్ 80, డు ప్రెజ్ 52 నాటౌట్; హర్మన్ప్రీత్ 2/42, రాజేశ్వరి 2/61).