హైదరాబాద్, జనవరి16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తయింది. స్వల్ప కాలంలోనే రాష్ట్రం 5 కోట్లకుపైగా టీకాలను పంపిణీ చేయడంతోపాటు 100% తొలి డోసు పూర్తిచేసిన రాష్ర్టాల జాబితాలో అగ్రగామిగా నిలిచింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వం, మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కొవిడ్ కట్టడి, వ్యాక్సిన్ల పంపిణీ, బాధితులకు వైద్యసేవలను అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో గతేడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మొత్తంగా 18 ఏండ్లు పైబడిన 2,77,67,000 మందికి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 2,85,43,226 మందికి తొలి డోసు పంపిణీ చేసింది. నిర్దేశిత లక్ష్యం కంటే ఇది 3 శాతం అధికం. అంతేకాకుండా అనతి కాలంలోనే ఫస్ట్ డోస్ను పూర్తిచేసిన పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 2,08,59,145 మందికి రెండో డోసును సైతం పంపిణీ చేసి 75 శాతం లక్ష్యాన్ని సాధించింది. దీన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం బూస్టర్ డోసుతోపాటు 15-18 ఏండ్ల వయసు వారికి సైతం టీకాలు వేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వల్లే: మంత్రి హరీశ్రావు
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వం, సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఏడాది నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగుతుండటంపై ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యారోగ్య, శానిటేషన్ సిబ్బందిని అభినందించారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకురావాలని, 100% వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని మంత్రి హరీశ్రావు కోరారు.
కొత్తగా 2,047 కొవిడ్ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 55,883 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,047 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ దవాఖానలో 125 కరోనా కేసులు నమోదయ్యాయని, వారిలో 35 మంది గర్భిణులు, నలుగురు చిన్నారులు ఉన్నారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 3 బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నమోదైనట్టు పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ముగ్గురు కొవిడ్తో మరణించినట్టు తెలిపింది. ప్రస్తుతం 22,048 మంది ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని, 2,013 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొన్నారని వివరించింది.