న్యూఢిల్లీ: కెనడాలో ఇటీవల భారతీయుల పట్ల నేరాలు పెరిగాయి. విద్వేష దాడి ఘటనలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం వెళ్లే విద్యార్థులకు భారత్ హెచ్చరిక చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. కెనడాలో జరుగుతున్న విద్వేష నేరాలు, భారత వ్యతిరేక కార్యక్రమాల గురించి ఆ దేశంతో చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాడి ఘటనల గురించి దర్యాప్తు చేపట్టి, తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని కెనడా అధికారుల్ని రిక్వెస్ట్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. విద్వేష నేరాలకు పాల్పడుతున్న వారిని ఇంకా శిక్షించలేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కెనడా వెళ్లే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒట్టావోలో ఉన్న ఇండియన్ మిషన్ లేదా టొరంటో, వాంకోవర్లో ఉన్న కౌన్సులేట్లలో భారతీయ విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం తన ప్రకటనలో కోరింది.