హైదరాబాద్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ): భారత్ స్పోర్ట్స్ సూపర్ పవర్గాఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదని అంది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి సింధు మాట్లాడుతూ ‘గొప్ప లక్ష్యాలను సాధించేందుకు ప్రతిభావంతులైన ప్లేయర్లను ప్రోత్సహించాలి. క్రీడలకు మెరుగైన ప్రాధాన్యమివ్వాలి. పాఠశాల స్థాయి నుంచే ఈ ప్రయత్నాలు జరుగాలి. చిన్న వయసులోనే పిల్లలను క్రీడల వైపు ఆకర్షితులయ్యేలా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు చొరవ చూపించాలి’ అని అంది. ఈ కార్యక్రమంలో సింధు తండ్రి పీవీ రమణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దామోదర్, ఎంసీహెచ్ఆర్డీ డీజీ హర్ప్రీత్సింగ్, కోర్స్ డైరెక్టర్ దివ్య పర్మార్ తదితరులు పాల్గొన్నారు.