Ebola : ఆఫ్రికా (Africa) ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ (Ebola Virus) కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన నాలుగో ‘భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (India-Africa Forum Summit)’ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (Foreign Ministry) గురువారం ప్రకటించింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా (Uganda) దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ ఇటీవల అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ (Health Emergency) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సదస్సును వాయిదా వేయడానికి ముందు భారత ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, కీలక నేతలు అందరూ పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడటంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సదస్సును మరో తేదీకి మార్చడమే మంచిదని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఆఫ్రికాలో ఎబోలాను అదుపు చేయడానికి ‘ఆఫ్రికా సీడీసీ’ తీసుకుంటున్న చర్యలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించింది.