న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రపంచ ఆహార భద్రత (జీఎఫ్ఎస్) సూచీ-2021లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. మొత్తం 113 దేశాలపై అధ్యయనం జరిపి ఎకనమిస్ట్ ఇంపాక్ట్, కొర్టెవా అగ్రిసైన్స్ సంస్థలు ఈ జాబితాను విడుదల చేశాయి. ఆహారం కొనుగోలు సామర్థ్యం విషయంలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక కంటే భారత్ వెనుకబడింది. మొత్తంగా ఆహార భద్రతలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. గడిచిన దశాబ్దకాలంలో ఆహార భద్రతలో భారత్ పెద్దగా పురోగతి సాధించలేదని నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, చైనా.. భారత్ కంటే ఎంతో ముందున్నట్టు వివరించింది.