Virat Kohli | టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెప్పాడు. త్వరలో వెస్టిండీస్తో జరిగే టీ-20 సిరీస్లో కోహ్లీ ఖచ్చితంగా భారీగా పరుగులు చేస్తాడని విశ్వాసంతో ఉన్నట్లు తెలిపాడు. బుధవారం నుంచి వెస్టిండీస్ టీ-20 సిరీస్ ప్రారంభం కానున్నది. ఇటీవల వెస్టిండీస్తో వన్డే సిరీస్లో కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. మూడు వన్డేల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్రభావంపై విక్రమ్ రాథోడ్ స్పందించాడు. కోహ్లీ ఫామ్ కోల్పోయాడనడం సరి కాదన్నాడు. నెట్స్లో మెరుగ్గా రాణిస్తున్న కోహ్లీ కెరీర్లో ఇదొక దశ మాత్రమే. వన్డే సిరీస్లో విఫలమైనా.. టీ-20లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని నమ్మకం ఉందన్నాడు. తమ బ్యాటింగ్ విభాగంలో ఎటువంటి సమస్యల్లేవని తెలిపాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించే సామర్థ్యం టీం ఇండియా బ్యాట్స్మెన్కు ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 వరల్డ్ కప్ కోసం ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సత్తా గల తక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్లలో రిషబ్ పంత్ ఒకడని విక్రం రాథోడ్ తెలిపాడు. కనుక అతడ్ని మిడిలార్డర్లోనే పంపుతామన్నాడు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ టీంలో పంత్ కీలక ప్లేయర్ అని, అందులో సందేహమే లేదన్నాడు. వెస్టిండీస్ సిరీస్కు కేఎల్ రాహుల్ దూరమైనా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వన్డేల్లో విఫలమైనా టీ-20లో వెస్టిండీస్ జట్టు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయట్లేదన్నాడు.