వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టును ఆదుకునేలా కనిపించిన ఎయిడెన్ మార్క్రమ్ (25) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సఫారీ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన మార్క్రమ్.. అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన బంతిని ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించిన మార్క్రమ్ మిస్సయ్యాడు.
దీంతో అది వెళ్లి అతని ప్యాడ్లను తాకింది. అంపైర్ నాటవుట్ ఇవ్వడంతో రోహిత్ రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి వికెట్లను కూల్చేదని తేలడంతో మార్క్రమ్ మైదానం వీడాడు. అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో ఆ జట్టు ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయింది. దీంతో సఫారీ జట్టు 9 ఓవర్లలో 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.