తిరుమల : ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ,విదేశాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 78,466 మంది భక్తులు దర్శించుకోగా 29,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల స్వామివారి హుండీకి రూ.3.52 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
23న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల ( Vaikuntha Dwara Darshanala ) సందర్భంగా ఈనెల 23న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా 23వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ( VIP break darshans ) రద్దు చేయడంతో 22వ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు.