హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా, వేగంగా సాగుతున్నది. పంటను అమ్ముకొనేందుకు రైతన్న కష్టపడకూడదన్న సదుద్దేశంతో రాష్ట్రప్రభుత్వం వానకాలం పంట మొత్తాన్ని కొనటం ప్రారంభించింది. గత వానకాలం సీజన్లో నవంబర్ 17 నాటికి 4,100 కేంద్రాల ద్వారా 9.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించ గా, ఈ సీజన్లో అదే తేదీ నాటికి 4,772 కేంద్రాలు ప్రారంభించి 10.69 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసింది. తుఫానులు ఏర్పడవచ్చన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. కల్లాల్లో ధాన్యం నిలువ ఉండకుండా వీలైనంత త్వరగా కాంటా వేసి మిల్లులకు తరలిస్తున్నారు. తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రమే ఆరబెట్టేవరకు ఆపుతున్నారు.
రైతులు ఏవిధంగానూ నష్టపోకూడదని రాష్ట్రప్రభుత్వం కష్టపడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాత్రం యథావిధిగా తన చపలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. యాత్రలపేరుతో రౌడీమూకనేసుకొని రైతులపై దాడులుచేయిస్తున్న ఆయన, ధాన్యం కొనుగో లు ప్రక్రియ సజావుగా సాగడంలేదని బుధవారం మీడియాముందు అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నారు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజమని నమ్ముతారన్న భ్రమలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. యాత్రలో ఎక్కడికెళ్లినా రైతులు చీకొట్టడంతో ఏంచేయాలో అర్థంకాని గందరోళంలో ఉన్నారని ఆయన మాటలు చూస్తేనే తెలుస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.