ఐనవోలు, డిసెంబర్ 29: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. గురువారం జాతర బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సీపీకి ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్రావు అర్చకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం సీపీ రంగనాథ్ మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్, పర్వతగిరి సీఐ శ్రీనివాస్తో కలిసి ఆలయ ఆవరణలో పరిశీలించారు. జాతరను అనుసంధానం చేసే గర్మిళ్లపల్లి, వెంకటాపురం, వరంగల్, సింగారం రహదారులపై ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలు, చెక్పోస్టు పాయింట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాలు ఇన్, అవుట్లను మ్యాప్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ఏరియాను పరిశీలించి, ఆర్టీసీ బస్సులను ఆలయాల సమీపం వరకు వచ్చేలా రూట్ ఏర్పాటు చేయాలని రంగనాథ్ అదేశించారు. పోలీసు అవుట్ పోస్టును పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. మల్లన్న బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా వస్తారని అన్నారు. ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జాతర సమయంలో నాలుగు వైపుల నుంచి వచ్చే రోడ్లకు 9 పార్కింగ్ ఏరియాలు, 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్టున్నట్లుగా వివరించారు. ఆలయం లోపలికి దాతలు రావడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. సుమారు 140 సీసీ కెమెరాలతో జాతర బందోబస్తు పర్యవేక్షణ చేస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తామన్నారు.
12 మంది సీఐలు, 34 మంది ఎస్సైలు, 78 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, 180 మంది కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, స్పెషల్ పార్టీతో మొత్తం సుమారుగా 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకన్న, ఎస్బీ ఎస్సై చక్రధర్, స్థానిక సర్పంచ్ జన్ను కుమారస్వామి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్కుమార్, వార్డు సభ్యుడు మహేందర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.