హైదరాబాద్, ఆట ప్రతినిధి: నిరంతరం రోగులు, మందులు, స్టెతస్కోప్తో సహవాసం చేసే వైద్యులు బ్యాట్, బంతి పట్టుకుని మైదానంలోకి దిగనున్నారు. ఐపీఎల్ తరహాలో తమకో లీగ్ ఉండాలని డాక్టర్స్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (డీసీపీఎల్)ను ప్రారంభించారు. ఈనెల 19 నుంచి 24 వరకు హైదరాబాద్ వేదికగా ఈ కొత్త లీగ్ తొలి సీజన్ జరుగనుంది. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ లీగ్ వివరాలు వెల్లడించారు. ‘ఎమ్మెస్కే ప్రసాద్ వరల్డ్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ, డ్రీమ్11 స్పోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ లీగ్లో 8 జట్లు బరిలో నిలిచాయి. హైదరాబాద్తోపాటు దేశంలోని ప్రధాన దవాఖానాలకు చెందిన 160 మంది వైద్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈనెల 20న నిర్వహించే వేలంలో 8 జట్లకు15 మంది ప్లేయర్లను ఎంపిక చేస్తాం. విజేతకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తాం’ అని వివరించారు. ఈ సందర్భంగా జట్ల లోగోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ 11 స్పోర్ట్స్ సీఈవో అనిల్ పెండెల, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.