న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఓ చెక్బౌన్స్ కేసును నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు .. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానా క్రికెటర్ మ్రినాంక్ సింగ్ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆ నోటీసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. మ్రినాంక్ సింగ్ సుమారు 1.63 కోట్ల మోసం చేశాడు. లగ్జరీ వాచీలు, ఇతర వస్తువులు ఇప్పిస్తానని చెప్పిన మ్రినాంక్ తనను మోసం చేసినట్లు తన ఫిర్యాదులో రిషబ్ తెలిపాడు. అయితే ఇప్పటికే మ్రినాంక్ మరో చీటింగ్ కేసులో జూహూలోని ఆర్థర్ రోడ్డు జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. రిషబ్ దాఖలు చేసిన కేసులో సాకేత్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు మే 13వ తేదీన ఆర్థర్ జైలుకు నోటీసులు ఇచ్చింది. జూలై 19న జరిగే విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్రినాంక్ హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
లగ్జరీ వాచీలు, మొబైళ్లు, జ్వలరీ వ్యాపారం చేస్తున్నానని, డిస్కౌంట్లో ఆ ఐటమ్స్ ఇప్పిస్తానని చెప్పి మిన్రాంక్ భారీ మొత్తంలో పంత్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. పంత్కు చెందిన ఖరీదైన వాచీలు, జ్వలరీ, ఇతర ఐటమ్స్ను కూడా అమ్మిపెడుతానని మ్రినాంక్ ఆశ చూపాడు. తన వద్ద ఉన్న 36.25 లక్షలు, 62.60 లక్షల ఖరీదైన వాచీలను అమ్మాలని మ్రినాంక్కు వాటిని పంత్ ఇచ్చేశాడు. వీటితో పాటు మరిన్ని లగ్జరీ వస్తువులను కొనేందుకు రెండు కోట్లు ఇచ్చాడు. అయితే డీల్ ప్రకారం ఐటమ్స్ ఇవ్వకపోవడంతో ఆ డీల్ను రద్దు చేశారు. ఆ తర్వాత ఇద్దరూ 1.63 కోట్ల డీల్కు సెటిల్మెంట్ కుదుర్చుకున్నారు. అయితే అంత మొత్తానికి సంబంధించిన చెక్ ను మ్రినాంక్ ఇచ్చాడు. కానీ ఆ చెక్ బౌన్స్ అయినట్లు రిషబ్ తన ఫిర్యాదులో తెలిపారు.