సిరిసిల్లా : క్రీడల్లో మాదిరి రాజకీయాల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే సత్తా కలిగి ఉండాలని సిరిసిల్లా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ (MLA KTR ) అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కేసీఆర్ కప్ (KCR Cup) వాలీబాల్ టోర్నమెంట్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో, రాజకీయంలో ఎదురుదెబ్బలు సహజమని పేర్కొన్నారు. గోడకు తగిలిన రబ్బర్ అదే తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామని అన్నారు.
క్రీడల్లో మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు, వారిని సానబట్టి బయటకు తీసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. పోటీల్లో మంచి స్ఫూర్తిని చాటాలని ఆకాంక్షించారు. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు గురిఅవుతుండడం బాధాకరమని అన్నారు. విద్యార్థులు, యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ ( BRS ) హయాంలో ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటుకు కృషి చేసిందని వివరించారు. ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ బైరగోని లావణ్య తదితరులు పాల్గొన్నారు.