ఒకటి కాదు, రెండు కాదు మర్రి, మహాగని, రోజ్వుడ్, నేరేడు.. వేప, వెలగ.. ఇలా పదుల సంఖ్యలో వివిధ రకాల మొక్కలు.. పది ఎకరాలకు పైగా విస్తీర్ణం.. ఎక్కడ చూసినా, ఎటువైపు తిరిగినా మొక్కలే. సువాసనను వెదజల్లేవి ఓ వైపు.. ఔషధ గుణాలు కలిగినవి మరోవైపు.. పండ్ల మొక్కలు ఇంకోవైపు.. ఇలా ఏటా లక్షల్లో మొక్కల పెంపకంతో హరితహారం విజయవంతంలో భాగమవుతున్నది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ డివిజన్ హయత్నగర్ రేంజ్లోని కుంట్లూర్ సెంట్రల్ నర్సరీ.
హయత్నగర్ రూరల్, నవంబర్ 24
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది. వివిధ రకాల పండ్ల, పూల మొక్కలతోపాటు ఔషధ మొక్కలను పెద్దఎత్తున పెంచుతున్నారు. అటవీశాఖ శంషాబాద్ డివిజన్ హయత్నగర్ రేంజ్ కుంట్లూర్ సెంట్రల్ నర్సరీలో 4 లక్షలకుపైగా మొక్కలు పెంచుతున్నారు.
విత్తులతో మొదలు..
నర్సరీలో ముందుగా విత్తనాలతో ప్రైమరీ బెడ్ వేస్తారు. విత్తనాన్ని బట్టి 10 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో మొలకలు వస్తాయి. నారు నాణ్యత చూసి వాటిని చిన్న చిన్న మట్టి కవర్లలో వేస్తారు. మొక్కలు కొంచెం పెద్దగా కాగానే వాటిని వేరే కవర్లలోకి మారుస్తారు. మరికొన్ని రోజులకు భారీగా పెరిగే మొక్కలను వేరేగా చేసి మరింత పెద్ద కవర్లలో పెడతారు. ఇలా విత్తనం మొలకెత్తింది మొదలు.. మొక్క పెరిగేవరకు అన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. శంషాబాద్ అటవీరేంజ్లో పరిధిలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే మొక్కలు సరఫరా చేస్తారు. మంకాల్, శంషాబాద్తోపాటు హెచ్ఎండీఏకు సైతం ఇక్కడి నుంచి మొక్కలు సరఫరా చేసినట్టు నర్సరీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇర్షాద్ అహ్మద్ తెలిపారు.
నర్సరీలో మొక్కలు
మహాగని, మర్రి, రోజ్వుడ్, రావి, పాల కురస, నారేపి, బాదం, ఉసిరి, వేప, జమ్మి, కానుగ, రేగి, ప్యాతోడియా, నేరేడు, ఊడుగ, చింత, వేమమద్ది, నల్లజీడి, తానె, కరుక, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, ఆకాశమల్లి, నీరుద్ది, విప్పి, ఖర్జూర, చైనా బాదం, మారేడు, వెలగ, పిరిగి తదితర మొక్కలు వేల సంఖ్యలో పెంచుతున్నారు. వీటిలో సువాసనను వెదజల్లే పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయని బీట్ ఆఫీసర్ కృష్ణవేణి తెలిపారు. తానె, కరక, సోమిడి, వేరుమద్ది, ఉసిరి, వెలగ, నల్లజీడి తదితర మొక్కలను ఆయుర్వేద, ఇతర ఔషధాల తయారీలో వినియోగిస్తారని వెల్లడించారు.
ప్రతి మొక్కపై శ్రద్ధ
నర్సరీలో ప్రతి విషయంపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాం. ప్రైమరీ బెడ్లు వేయడం, నారు పీకడం, మొక్కలను పంపిణీకి సిద్ధం చేయడం వరకు అన్నింటిపై శ్రద్ధ పెడతాం. నర్సరీలో ప్రస్తుతం 4 లక్షలకుపైగా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాం. మొక్కల పెంపకాన్ని మరింత చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.