న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది. నిందితుడు రిషి తన రెండో భార్య మమతను తొలి భార్య బేబీ, ఫ్రెండ్ సాయంతో కడతేర్చాడని వెల్లడైంది. మమత ప్రవర్తనతో విసుగు చెందిన తాము ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నామని నిందితుడి మొదటి భార్య బేబి పోలీసులకు తెలిపింది.
మృతురాలు మమతపై రిషీ ఫ్రెండ్ కరణ్ లైంగిక దాడి జరిపి ఆపై ఊపిరిఆడకుండా చేసి ఉసురు తీశాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. నరేలాలోని పంజాబీ కాలనీ వద్ద ప్రభుత్వ పాఠశాల సమీపంలో మహిళ మృతదేహం పడిఉందని ఏప్రిల్ 18న పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. ఆపై ప్రత్యక్ష సాక్షులను విచారించగా రిషీ సహోద్యోగి రాకేష్ కీలక సమాచారం అందించాడు.
ఏప్రిల్ 16 రాత్రి మంగళ్ బజార్ ప్రాంతంలో రిషీ, మమతలను చూశానని చెప్పాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీకి వచ్చిన రిషీ తాను కుటుంబ గొడవలతో మమతను గురుగ్రాంలోని వారి బంధువుల ఇంటికి పంపానని చెప్పాడని వివరించాడు. మరుసటి రోజు ఫ్యాక్టరీకి రాకపోవడంతో తాను రిషీకి ఫోన్ చేయగా మమతను కరణ్ సాయంతో చంపేశానని అంగీకరించాడని చెప్పాడు. మమత, రిషీ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, మమత పట్ల అసూయతో రగిలిన బేబి హత్యకు పురిగొల్పిందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడు రిషిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.