ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. తన స్నేహితురాలి (11)పై తన సమక్షంలో లైంగిక దాడికి పాల్పడేలా ముగ్గురు వ్యక్తులను మహిళ (21) ప్రేరేపించడం కలకలం రేపింది. ముంబైలోని విరార్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులతో పాటు బాధితురాలి స్నేహితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తన సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ఈనెల 16 సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి మొబైల్ షాపునకు బయలుదేరింది.
అక్కడ బాలికకు తన స్నేహితురాలు కనిపించి షికారుకు వెళ్దామని నమ్మబలికింది. బాధిత బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన ఆమె ఫ్రెండ్ అక్కడి నుంచి తన బాయ్ప్రెండ్స్కు ఫోన్ చేసి రప్పించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్జన ప్రదేశానికి చేరుకున్న నిందితులు ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన గణేష్ మంటపం వెనక్కి తీసుకువెళ్లి నిర్భందించారు. బాధిత బాలికపై ఆమె స్నేహితురాలు చూస్తుండగానే వారు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
మరుసటి రోజు ఉదయం బాలికను తన ఇంటి సమీపంలో విడిచిపెట్టి ఆపై నిందితులు పరారయ్యారు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు బాధితురాలి స్నేహితురాలి కదలికలపై కన్నేసిఉంచారు. నిందితుల్లో ఒకరు కాలేజ్ స్టూడెంట్ కాగా, మరొకరు కూరగాయల విక్రేతగా గుర్తించారు. మూడో నిందితుడు డ్రగ్ డీలర్ అని పోలీసులు చెప్పారు. బాలిక స్నేహితురాలితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.