విష్ణు విశాల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు మను ఆనంద్ మాట్లాడుతూ ‘ఇదొక డార్క్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఓ ముస్లిం యువకుడు అనుకోకుండా టెర్రరిజంతో సంబంధం లేకపోయినా అందులో ఇరుక్కుంటాడు. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో ఎటువంటి వివాదస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ఇది ఏ మతానికి సంబంధించిన సినిమా కాదు. యాక్షన్ థ్రిల్లర్, హ్యుమన్ రిలేషన్స్, డ్రామా కూడా వుంది. సంభాషణలు కూడా ఎవరిని టార్గెట్ చేసినట్లు వుండవు. విష్ణు విశాల్ నటించిన ‘రాక్షసన్’ సినిమా చూసి ఎఫ్ఐఆర్ సినిమాలో హీరో పాత్రకు అతనే కరెక్ట్ అని నిర్ణయించు కున్నాను. ఇప్పుడు సినిమా చూసిన తరువాత నా నిర్ణయం వందశాతం కరెక్ట్ అనిపించింది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. ఓటీటీలో ఆఫర్లు వచ్చినా ఈ చిత్రంలోనే వున్న భారీతనం, కంటెంట్ను సినిమా హాలులో చూస్తేనే బాగుంటుందని ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు.