న్యూఢిల్లీ: ఐఐటీలు సత్తా చాటాయి. కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసిన ఈ యేటి ఇండియా ర్యాంకింగ్స్లో ఐఐటీలే హవా కొనసాగించాయి. ఉత్తమ విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఐఐటీ మద్రాసు టాప్ ప్లేస్లో నిలిచింది. ఇక బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూ ఆఫ్ సైన్స్ రెండవ స్థానంలో నిలువగా, ఐఐటీ బాంబే మూడవ స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 2022 జాబితాను రిలీజ్ చేశారు. టాప్ టెన్ స్థానాల్లో ఆరు స్థానాలను ఐఐటీలే గెలుచుకున్నాయి. ఈ ఏడాది ఢిల్లీలోని ఎయిమ్స్ 9వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఢిల్లీ ఎయిమ్స్ ఆ జాబితాలో లేని విషయం తెలిసిందే.
ఇక యూనివర్సిటీల్లో.. కేంద్ర విద్యాశాఖ ప్రకారం.. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్ యూనివర్సిటీగా నిలిచింది. ఇక ఢిల్లీకి చెందిన జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలు వరుసగా రెండవ, మూడవ ర్యాంక్లో నిలిచాయి. మొత్తం 11 క్యాటగిరీల్లో ర్యాంకులను ప్రకటిస్తారు. ఓవరాల్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, కాలేజీ, మెడికల్, ఆర్కిటెక్చర్, లా, డెంటల్, రీసర్చ్ క్యాటగిరీల్లో ర్యాంకులను ప్రకటించారు.
ఫార్మసీ క్యాటగిరీలో హైదరాబాద్కు ఓ ర్యాంక్ వచ్చింది. ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ మూడవ ర్యాంక్లో నిలిచింది. ఈ క్యాటిరీలో జామియా హమ్దర్ద్ టాప్ ప్లేస్లో నిలిచింది.
కాలేజీల్లో ఢిల్లీ యూనివర్సిటీ కాలేలు అయిదు ర్యాంకులను గెలుచుకున్నాయి. మిరండా హౌజ్, హిందూ కాలేజ్, ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీ, ఢిల్లీ వర్సిటీలోని కిరోరిమాల్ కాలేజీలు ర్యాంక్లు సాధించాయి.
లా కాలేజీల్లో పూణెలోని సింబయాసిస్ మళ్లీ టాప్ త్రీలోకి వచ్చేసింది. హైదరాబాద్కు చెందిన నల్సార్ స్థానాన్ని పూణె సింబయాసిస్ కైవసం చేసుకున్నది. బెంగుళూరు, ఢిల్లీ లా కాలేజీలు టాప్ రెండు స్థానాలను సొంతం చేసుకున్నాయి.