సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): చదవకుండా అడ్డదారిలో సర్టిఫికెట్లు పొందాలనుకుంటే కటకటాల్లోకి వెళ్లక తప్పదని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇద్దరు కన్సల్టెన్సీ నిర్వాహకులతో మధ్యప్రదేశ్లోని సర్వేపల్లి రాధాకృష్ణ వర్సిటికీ చెందిన ప్రొఫెసర్ను, నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కన్సల్టెన్సీల ద్వారా 300 మంది వరకు విద్యార్థులు గతంలోనూ నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటవుతున్న సిట్ ఈ విషయంపై పూర్తి వివరాలను సేకరించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ కేతన్ సింగ్తో పాటు మలక్పేటలోని శ్రీసాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, ప్రైడ్ ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకులు అంచ శ్రీకాంత్రెడ్డి, గుంటి మహేశ్వర్రావులను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రాథమిక విచారణలో వర్సిటీలోని ప్రధాన అధికారుల ప్రొద్బలంతోనే ఫేక్ సర్టిఫికెట్లు తయారవుతున్నాయనే విషయాన్ని కేతన్ సింగ్ వెల్లడించాడు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో వివరాలను రాబట్టి, వర్సిటీ అధికారుల్లో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో మరింత లోతైన దర్యాప్తు జరుపనున్నారు.
తాజాగా అరెస్టయిన కన్సల్టెన్సీ నిర్వాహకులు ఎంత పాతదైనా, ఏ డిగ్రీకైనా సర్టిఫికెట్లు ఇప్పించే వారు. చాలామంది విద్యార్థులు 2016-17లో ఇంజినీరింగ్, డిగ్రీలు పూర్తి చేసినట్లు ధ్రువీకరణపత్రాలు పొందారు. ఈ సర్టిఫికెట్లు వర్సిటీల నుంచే వచ్చాయి. అక్కడి అధికారులు వాటిపై పాత తేదీలు ప్రింట్ చేసి వాటిని కన్సల్టెన్సీలకు పంపిస్తున్నారు. విద్యార్థులు పరీక్షలు రాయకుండా, పరీక్ష ఫీజులు చెల్లించకుండానే డబ్బులతో సర్టిఫికెట్ చేతికి వచ్చేస్తోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్ల దందాలో ములాల వరకు వెళ్లి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు.