బీడు భూములు.. వలస బతుకులు! తలాపున కృష్ణమ్మ ఉన్నా తడారిన గొంతులు! కడుపు నొచ్చినా.. కాలు నొచ్చినా కాయ గసరే తప్ప.. కనుచూపుమేరలో దవాఖాన లేని దుస్థితి! పల్లేర్లు మొలిసిన పల్లెల్లో దేశం పోయిన తన పిల్లలకోసం పండుటాకుల పడిగాపులు! అమ్మ, అయ్య ఎప్పుడొస్తారోనని చిన్నపిల్లల ఎదురుచూపులు! ఉమ్మడి రాష్ట్రంలో ఇదీ పాలమూరు దుస్థితి!
పచ్చని పైరులు.. పశువుల మందలు.. జలజల ధ్వనులతో వాగులు వంకలు! పంట సిరులతో పాడివృద్ధితో వికసిస్తున్న పల్లెలు! అర్ధరాత్రి అపరాత్రి ఏ చిన్న జబ్బు చేసినా అల్లంత దూరంలోనే దవాఖాన! వలసల వాపస్తో వెలుగుతున్న ముఖాలు! ఇదీ నేటి ఉమ్మడి పాలమూరు జిల్లా సాధించిన ప్రగతి. ఆరేండ్ల స్వరాష్ట్ర స్వపరిపాలనలో సమూలంగా మారిన జిల్లా ముఖచిత్రం!!
మహబూబ్నగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు నవ్వుతున్నది. అపర భగీరథుడి అకుంఠిత సంకల్పం వలసల జిల్లా తలరాతను పూర్తిగా మార్చివేసింది. తలాపునే కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా గుక్కెడు నీటి కోసం అలమటించిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు జలసిరులు గలగలలాడుతున్నాయి. ఆరేండ్లలో జిల్లాపై సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు పచ్చని పైరుల రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2 లక్షల ఎకరాలకే ఆయకట్టు ఉండగా నేడు 10 లక్షల ఎకరాలకు పక్కాగా సాగునీరందుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకొని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందుకు సాగుతున్నది. పాలమూరు అంటే వలస కూలీలు కాదు.. పాలమూరు అంటే పాడి పంటలు, పర్యాటకం అని కొత్త నిర్వచనం ఇచ్చింది తెలంగాణ సర్కారు.
3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు డిజైన్ చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమైక్య రాష్ట్రంలో నీటి కేటాయింపులు 25 టీఎంసీలు మాత్రమే. అప్పుడు 13 వేల ఎకరాలకే సాగునీరు అందేది. తెలంగాణ ప్రభుత్వం జీవో 141 ద్వారా కేటాయింపులను 40 టీఎంసీలకు పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పనులు పూర్తికాని జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్ల వద్ద లిఫ్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్నారు. గొలుసుకట్టు చెరువులన్నీ బాగయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద ఇప్పుడు 3.5 లక్షల ఎకరాల భూమి సాగవుతున్నది. వనపర్తి జిల్లాలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడింది. 1.80 లక్షల ఎకరాల్లో వరి పండించే స్థాయికి రైతులు చేరుకున్నారు. వాగులపై చెక్ డ్యాంలు నిర్మించి అదనపు ఆయకట్టు సృష్టించింది.
64 వాగులపై రూ.332.521 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించింది. ఎండాకాలంలోనూ అవి నీటితో కళకళలాడుతున్నాయి. వనపర్తి జిల్లాలో 2013లో 16.19 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు (జనవరి 2020) 2.69 మీటర్లపైకి ఎగిసి వచ్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గతంలో ఏటా 12 లక్షల మంది ముంబై తదితర మహానగరాలకు బతుకుదెరువుకోసం వలసలు పోయేవారు. ఇప్పుడు సొంతూరులోనే చేతినిండాపని దొరకడంతో పిల్లాపాపలతో హాయిగా జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఆయుపట్టులాంటి మహబూబ్నగర్ పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో 14 రోజులకోసారి తాగునీరు వచ్చే ది. తెలంగాణ ఏర్పడ్డాక జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే రామన్పాడు పైప్లైన్కు మరమ్మతులు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మిష న్ భగీరథ ప్రారంభం కావడంతో పట్టణవాసులకు రోజూ శుద్ధజలం అందుతున్నది.
ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ 25 వేలకు మించి సాగునీరు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2018 నవంబర్ 28న రూ.397 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల మొదటి దశ పనులు పూర్తిచేసి దశాబ్దాల ఆర్డీఎస్ రైతుల సాగునీటి కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది. తుమ్మిళ్ల ద్వారా అదనంగా 37 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నది. చివరి ఆయకట్టుకూ రెండు పంటలకు నీళ్లు అందుతున్నాయి. త్వరలో మరో 20 వేల ఎకరాల ఆయకట్టును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మల్మమ్మ కుంట, జులకల్, ఒల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తే ఆయకట్టు మరింత పెరుగొచ్చు.
సమైక్య రాష్ట్రంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం చేపట్టినా, దాని పరిధిలో 2014 వరకు సాగు చేసింది 2,300 ఎకరాలే. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో నెట్టెంపాడు పెండింగ్ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. 2 వేల నుంచి 2 లక్షలకు ఆయకట్టు పెరిగింది. వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు. భీమా ఎత్తిపోతల పథకం పరిధిలోనూ పూర్తిస్థాయిలో 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అంతకుముందు ఏ మాత్రం పట్టించుకోని కోయిల్సాగర్ సైతం పూర్తి ఆయకట్టు 50 వేల ఎకరాలకు చేరుకున్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాకు వరప్రదాయినిగా మారనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రోజూ రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తూ సుమారు 12.3 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీరు అందివ్వనున్నది. సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లే ఈ సాంకేతిక అద్భుతం పనులు 75% పూర్తయ్యాయి. రిజర్వాయర్లు, 50 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ మినహా ఈ ప్రాజెక్టులోని మిగతా నిర్మాణాలన్నీ భూగర్భంలోనే దాదాపు 100 మీటర్ల లోతులో ఉండటం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను బిగించగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈ రికార్డును తిరగరాయనున్నది. ఈ ప్రాజెక్టులోని నాలుగు లిఫ్ట్లలో ఉపయోగిస్తున్న పంప్హౌజ్ల సామర్థ్యం ఏకంగా 145 మెగావాట్లు. ఇది ప్రపంచ రికార్డుగా నిలువనున్నది. వీటిని ‘మెగా బాహుబలి’ మోటర్లుగా పిలుస్తున్నారు. ఇలాంటివి నాలుగు పంప్హౌజ్లలో మొత్తం 31 మోటర్లను వినియోగించనున్నారు.
పాలమూరు అంటే కరువు కాటకాలకు నిలయంగా భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరును పర్యాటక కేంద్రంగా మార్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఎకో, టెంపుల్, రివర్ టూరిజం ద్వారా సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నల్లమలలో ఎకో టూరిజం, కృష్ణానదిలో రివర్ టూరిజం, అలంపూర్ జోగుళాంబ, మన్యంకొండ, కురుమూర్తి తదితర దేవాలయలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధిచేశారు. రూ.91.62 కోట్లతో నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చిన్న ప్రమాదం జరిగినా స్థానిక జిల్లా దవాఖానలో వైద్యం అందని దుస్థితి ఉండేది. ఇప్పుడు అధునాతన పరికరాలతో జనరల్ దవాఖాన ప్రారంభమైంది. ఒకప్పుడు 28 మంది వైద్యులు, 28 మంది నర్సులుంటే.. ఇప్పుడు 120 మంది వైద్యులు, 350 మంది నర్సులు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఎక్స్రే తీసేందుకు ఇబ్బందులు పడినచోట నేడు డిజిటల్ ఎక్స్రే, 3-డీ సీటీ స్కాన్, అధునాతన ఆపరేషన్ థియేటర్లు, పాలియేటివ్, తలసేమియా, కార్డియో, న్యూరో, యూరాలజీ తదితర ప్రత్యేక ఓపీ సేవలూ ప్రారంభమయ్యాయి. నిత్యం 25 నుంచి 30 కాన్పులు, 2 వేలకుపైగా అవుట్ పేషెంట్లతో దవాఖాన కిక్కిరిసిపోతున్నది. సుమారు 19 వేల మందికి కొవిడ్ చికిత్స అందించిన ఘనత పాలమూరు దవాఖానకు దక్కింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల రాకతో ఈ ప్రాంతం వైద్య విద్యకు సైతం చేరువైంది.
90% పూర్తయింది. మా ప్రభుత్వం చొరవతో ఇప్పుడు జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు నీరు అందుతున్నది. వలసల జిల్లాగా ముద్రపడిన పాలమూరులో ముంబైకి బస్సులు ఆగిపోయే పరిస్థితి క్రమంగా నెలకొంటున్నది. ఇప్పటికే చాలామంది తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండాలని, ఇందులో పాలమూరులోనే 20 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం- 2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.