కరాచీ, డిసెంబర్ 21: పాకిస్థాన్లోని ఓ హిందూ దేవాలయంలో దేవతా విగ్రహాలను ఒక దుండగుడు ధ్వంసం చేశాడు. కరాచీ ఓల్డ్సిటీలోని నారాయణ్పురలోని నారాయణ మందిర్లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితుడిని ముహమ్మద్ వాలీద్ షబ్బీర్గా గుర్తించి అరెస్టుచేసినట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ముకేశ్కుమార్ దంపతులు సోమవారం గుడిలో పూజలు చేసేందుకు వెళ్లగా.. దుండగుడు సుత్తితో దేవతా విగ్రహాలను ధ్వంసంచేయడం చూశారని పేర్కొన్నారు. హిందువులకు, హిందువుల ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.