హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ‘పంచాయతీరాజ్ సంస్థ ఆడిటింగ్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్లో అద్భుతమైన పనితీరును కనబర్చింది. తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్వయంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు లేఖ రాశారు.
లేఖలో.. ‘పంచాయతీరాజ్ సంస్థలకు ప్రభుత్వం విడుదల చేసే నిధుల వినియోగంపై పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ఆడిట్ను 2020 ఏప్రిల్లో ప్రారంభించాం. ఆన్లైన్ ఆడిటింగ్లో దేశంలోనే తెలంగాణ మొదటగా లక్ష్యాన్ని చేరుకొన్నది. జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు 2020-21 నిధులకు సంబంధించి వందకు వందశాతం నిర్దేశించిన సమయంలోనే ఆన్లైన్ ఆడిట్ నిర్వహించాయి. 2019-20లో 25 శాతం గ్రామాలను ఆన్లైన్ ఆడిట్ చేయాలని లక్ష్యం విధిస్తే, లక్ష్యానికి మించి ఆన్లైన్ నిర్వహించాయి.
రాష్ట్ర ఆడిట్ శాఖ చురుగ్గా వ్యవహరిస్తున్నది. ఆన్లైన్ ఆడిటింగ్లో సలహాలు, సూచనలు ఇస్తున్నది. తెలంగాణ పంచాయతరాజ్ సంస్థలు కూడా ఎప్పుటికప్పుడు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టాన్ని అభినందిస్తున్నాం. ఆడిట్శాఖ, పంచాయతీరాజ్, రాష్ట్ర లోకల్ ఫండ్ ఆడిట్శాఖను కూడా ప్రశంసిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆన్లైన్ ఆడిట్పై రాష్ర్టాన్ని ప్రశంసించింనందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. ప్రశంసలే కాకుండా నిధులు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.