న్యూఢిల్లీ, మార్చి 29: వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాల్ని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తగ్గించింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మన జీడీపీపై పడుతుందని ఇక్రా హెచ్చరిస్తూ రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పరిమితమవుతుందని మంగళవారం తెలిపింది. గత అంచనాల నుంచి ఈ రేటులో 0.8 శాతం మేర కోత విధించింది. యుద్ధ ప్రభావంతో కమోడిటీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు తలెత్తడం వంటి అంశాల కారణంగా వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 7.8 శాతం జీడీపీ వృద్ధి అంచనాల్ని రిజర్వ్బ్యాంక్ గత ద్రవ్య విధాన పరపతి సమీక్ష సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఏప్రిల్ నెల తొలినాళ్లలో జరిగే ఆర్బీఐ తదుపరి సమీక్షా సమావేశంలో ఈ వృద్ధి రేటును సవరించే అవకాశం ఉంది.
కేంద్రం వ్యయ ప్రణాళిక కీలకం
కరోనాతో గత రెండేండ్లు పర్యాటక ప్రాంతాలకు దూరంగా ఉన్న అధిక ఆదాయ వర్గాలు ఇకనుంచి టూరిజం స్థలాలను సందర్శించే అవకాశం ఉన్నదని ఇక్రా అంచనా వేసింది. అలాగే అంతర్జాతీయ డిమాండ్ను అందుకునేందుకు కొన్ని ఐటెమ్స్ ఎగుమతులు పెరుగుతాయని, దీంతో పరిశ్రమ వినియోగ సామ ర్థ్యం 2023-24 క్యూ3లో 74-75 శాతానికి చేరుతుందని, ఇది ప్రస్తుతేడాది 71-72 శాతంగా ఉందని రేటింగ్ ఏజెన్సీ వివరించింది. ఈ కారణంగా ప్రైవేట్ రంగం సామర్థ్య విస్తరణలో జాప్యం జరుగుతుందన్నది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన వ్యయ ప్రణాళికను త్వరితంగా ప్రారంభించడం ఆర్థిక వ్యవస్థకు కీలకం కానున్నదని, ఇది మొదలైతేనే 2022-23 ప్రథమార్ధంలో పెట్టుబడుల కార్యకలాపాలు మెరుగుపడతాయని ఇక్రా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అందించే వడ్డీ రహిత రుణ పరిమాణాన్ని రూ.1 లక్ష కోట్లకు పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. 2022-23లో ఇది రూ.15,000 కోట్లుగా ఉంది. కేంద్రం వ్యయ ప్రణాళికలో రాష్ర్టాలకు రుణాలుగా అందించబోయే మొత్తమే పెట్టుబడి కార్యకలాపాలకు ఊతమిస్తుందని ఏజెన్సీ వివరించింది.
క్యూ4లో వృద్ధి 3-4 శాతమే
ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి నాల్గో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి 3-4 శాతానికి పరిమితమవుతుందని ఇక్రా తాజాగా ప్రకటించింది. క్యూ3లో ఇది 5.4 శాతంగా ఉంది. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం నమోదుకావొచ్చని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే రష్యా-ఉక్రయిన్ సంక్షోభం కారణంగా అధికమైన ఇంధన ధరలు, వంటనూనెల ధరలు మధ్యతరగతి కొనుగోలు శక్తిని తగ్గిస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ పునరుద్దరణకు ఇది ఆటంకంగా మారుతుందని అదితి నాయర్ హెచ్చరించారు. 2022 సెప్టెంబర్ వరకూ ఉచిత ఆహారోత్పత్తుల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం పొడిగించడాన్ని ఆహ్వానిస్తూ అల్పాదాయ వర్గాలకు ఇది ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు.