న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్ల రెండవ స్క్వాడ్రన్ను ఏప్రిల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపూర్దుర్ జిల్లాలోని హసీమారా వైమానిక స్థావరంలో వీటిని మోహరించనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం తెలిపాయి. మే నాటికి రాఫెల్ రెండవ స్క్వాడ్రన్ తరలింపు పూర్తవుతుందని, ఆ సమయానికి ఫ్రాన్స్లో పైలట్ల శిక్షణ పూర్తవుతుందని వెల్లడించాయి.
36 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత్ 2016లో ఒప్పందం చేసుకున్నది. దీంతో భాగంగా గత ఏడాది తొలి బ్యాచ్ కింద ఐదు రాఫెల్స్ భారత్కు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్ 10న పంజాబ్లోని అంబాలా ఎయిర్స్టేషన్లో తొలి రాఫెల్ స్క్వాడ్రన్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఏఎఫ్లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఆ వైమానిక స్థావంలోని ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్లో వీటిని చేర్చారు.
మరోవైపు ఇటీవల మరి కొన్ని రాఫెల్స్ భారత్కు చేరాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మధ్యలో పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో రెండవ రాఫెల్ స్క్వాడ్రన్ను ఐఏఎఫ్లో ప్రవేశపెట్టనున్నారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.