తిరువనంతపురం: గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో కేరళకు చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఏ.ప్రదీప్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ ఆఫీసర్ భార్య శ్రీలక్ష్మీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. త్రిసూరులోని తాలూకా ఆఫీసులో క్లర్క్గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. రెవన్యూ మంత్రి కే రాజన్ ఆమెకు బాధ్యతలను అప్పగించారు. శ్రీలక్ష్మి అర్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వనున్నట్లు డిసెంబర్ 15వ తేదీన జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం విజయన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీలక్ష్మీ ఇవాళ తాలూకా ఆఫీసుకు వచ్చారు. ఆమెకు మంత్రి రాజన్ స్వాగతం పలికారు. పత్రాలపై సంతకాలు చేసిన ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తనకు ఉద్యోగం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కామర్స్ సబ్జెక్ట్లో శ్రీలక్ష్మీ పీజీ పూర్తి చేశారు. ప్రదీప్ సతీమణి శ్రీలక్ష్మికి ఇప్పటికే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. దీనితో పాటు వైద్య ఖర్చుల కోసం ఆయన తండ్రికి మరో 3 లక్షలు ఇచ్చారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ రావత్ ఫ్యామిలీ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.