హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: దేవాదాయశాఖ పరిధిలోని అర్చక, ఉద్యోగులు భూదాన సేకరణకు నడుంబిగించాలని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ సూచించారు. గురువారం బొగ్గులకుంటలోని శాఖ కార్యాలయంలో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల అర్చక, ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధులతో గ్రీవెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో వేతనాలు అందజేస్తామని చెప్పారు. భూదాన సేకరణ, వివాదాస్పద భూముల పరిరక్షణను జేఏసీ ప్రతినిధులు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్యాక్రాంతమైన 4,100 ఎకరాల భూములను తిరిగి దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. భూదాన సేకరణ మహాయజ్ఞంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తామని దేవాదాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు అగ్నిహోత్ర చంద్రశేఖర్శర్మ, ప్రధాన కార్యదర్శి మాదారం యాదగిరి, జేఏసీ కార్యదర్శి భద్రీనాథాచార్యులు, ఉపాధ్యక్షుడు కందాళ సంతోష్కుమార్చార్యులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతపంటి శ్రీనివాస్, ఆర్ చక్రధర్ పాల్గొన్నారు.
పురాతన దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని కోరుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్, దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దర్శనం పత్రిక సంపాదకుడు ఎంవీఆర్ శర్మ, గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి తదితరులు గురువారం బొగ్గులకుంటలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.