సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) ఆధ్వర్యంలో ప్రొడక్ట్ అవార్డ్స్ అండ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. 21వ విడత నిర్వహిస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.టీ.రామారావు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. గురువారం ఉదయం 9.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సదస్సు ఉంటుందని హైసియా ప్రతినిధులు తెలిపారు. ఐటీ కంపెనీల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన హైసియా ఇప్పటికీ 30 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రతి యేటా రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు ఐటీ కంపెనీలు, ఇటు ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.
ఇన్నోవేషన్ సమ్మిట్లోభాగంగా ఎమర్జింగ్ ప్రొడక్ట్, ఫాస్ట్ గ్రోయింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రొడక్టు, ఫాస్ట్ గ్రోయింగ్ కన్జూమర్ ప్రొడక్టు, ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్టు, ప్రొడక్టు విత్ సోషల్ ఇంపాక్ట్, ప్రొడక్ట్ లెడ్ బై విమెన్ కేటగిరీల్లో అవార్డుల ప్రదానం ఉంటుంది. వీటితో పాటు స్టార్టప్ కంపెనీలతో సమావేశాలు, ఏంజిల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్టులు, సీఈవోలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.