ముంబై: తొలి మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 15వ సీజన్లో బోణీ కొట్టడమే లక్ష్యంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ ఒక్క అంశంలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిన రైజర్స్.. ఈసారి సమిష్టిగా సత్తాచాటాలని చూస్తున్నది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. నటరాజన్, షెఫర్డ్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక బ్యాటింగ్ గురించి చెప్పనే అక్కర్లేదు. భారీ లక్ష్యఛేదనలో ఏమాత్రం పోరాట పటిమ కనబర్చలేకపోయిన మనవాళ్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ పూర్తిగా విఫలం కాగా.. అభిషేక్, సమద్, రాహుల్ త్రిపాఠి అంచనాలను అందుకోలేకపోయారు. మార్క్మ్ ఒక్కడు కాస్త పోరాడగా.. ఓటమి ఖాయం అని తెలిశాక సుందర్ ధాటిగా ఆడాడు. ఈ లోపాలన్ని సరిచేసుకుంటేనే రైజర్స్ గెలుపు బాట పట్టే అవకాశాలున్నాయి.