హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మీ పిల్లలకు ఆరోగ్యపరీక్షలు చేయించి ఎంత కాలమైంది? పిల్లలు చలాకీగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పరీక్షలెందుకంటారా? అయితే.. ఒక్కసారి మీ చిన్నారుల ఒక్కో చెవిని మూసి వారి వినికిడి శక్తిని గమనించండి. ఒక్కో కన్నును మూసి కంటిచూపు ఎలా ఉన్నదో పరీక్షించండి? వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ శక్తి వారికి ఉన్నదోలేదో గమనించారా? పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని మనం అనుకోవడానికి, శాస్త్రీయంగా నిర్ధారించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇందుకు హైదరాబాద్కు చెందిన హెల్త్ స్టార్టప్ ‘హీల్పా’.. తాజాగా నిర్వహించిన సర్వేనేనిదర్శనం. ఈ సర్వే ప్రకారం వందమంది పిల్లల్లో కనీసం ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో లేరని తేలింది. చిన్న వయసులోనే అధిక రక్తపోటు బారిన పడుతున్నారని వెల్లడైంది.
సర్వేలోని ముఖ్యాంశాలు ఇవీ..
పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే స్పష్టంగా చూడగలగాలి, వినగలగాలి. కానీ వారి ఇంద్రియాలు ఏ స్థితిలో ఉన్నాయో మనం గమనించం. మన శరీరంలో రెండుగా ఉన్న అవయవాల్లో (కన్ను, చెవులు, ముక్కు, కిడ్నీ వంటివి) ఒకటి పూర్తిగా చెడిపోయేవరకు మనం వాటి పనితీరును చెక్ చేయం. ఇదే పెద్ద సమస్య. కాబట్టి తల్లిదండ్రులు ఏటా ఒక్కసారైనా చిన్నారులకు బేసిక్ హెల్త్ చెకప్ చేయించాలి. దేశంలో దాదాపు 50 కోట్ల మంది 18 ఏండ్లలోపు వారు ఉన్నారు. అందులో 99 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నదంటే ఎంత భయంకరంగా ఉన్నామో ఊహించుకోండి. కాబట్టి పిల్లలకు శారీరక శ్రమ పెంచి, మానసిక ఒత్తిడి తగ్గించాలి. – రాజశేఖర్ జనపరెడ్డి, హెల్పా సీఈవో