మలక్పేట, అక్టోబర్ 30: వెయ్యి మైళ్ల దూరమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తామని, అది ఆ ప్రయాణానికే పునాది అవుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. జాబ్ కనెక్ట్లో భాగంగా శనివారం ఈస్ట్జోన్ పోలీసులు, టీఎంఐ ఫౌండేషన్ల సంయుక్తాధ్వర్యంలోఆస్మాన్ఘడ్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో యువతలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవన్నారు. కానీ ఈ తరం వారు అదృష్టవంతులని, నైపుణ్యంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్, టీఎంఐ గ్రూప్ చైర్మన్ మురళీధరన్, అడిషనల్ డీసీపీ కె.మురళీధర్, ఏసీపీలు వెంకటరమణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
1500 మంది హాజరు..
మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నాలుగువేల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకోగా, సుమారు 1500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. మొత్తం 4000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించిన 27 సంస్థలు.. 146 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. మరో 949 మందిని పోస్ట్ డేట్ ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు.ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నియామక పత్రాలను అందజేసి అభినందించారు.
సంతోషంగా ఉంది..
నేను బీటెక్ పూర్తిచేశాను. మొదటిసారి ఉద్యోగ మేళాకు వచ్చాను. మూడు కంపెనీల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాను. పోలీసులు యువతకు ఉపాధి కల్పించేందుకు ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది.
రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా..
2018లో బీకాం పూర్తిచేశాను. ప్రస్తుతం ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. రెండు కంపెనీల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా. చాలా కంపెనీలు ఒకేచోట ఇంటర్వ్యూలు నిర్వహించడం బాగుంది. కొన్ని కంపెనీల్లో వేతనాలు బాగానే ఉన్నాయి. కొన్నింటిలో తక్కువగా అనిపించింది.