సుల్తాన్పూర్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలైట్ గ్రూప్-ఈలో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచిన హైదరాబాద్ 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంతో నాకౌట్కు చేరింది. మంగళవారం గురుగ్రామ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 29 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (62; 7 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి అర్ధశతకంతో మెరువగా.. రాహుల్ (38 నాటౌట్) విలువైన పరుగులు జోడించాడు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ పేసర్ సీవీ మిలింద్ (3.2-0-8-5) నిప్పులు చెరగడంతో ఉత్తరప్రదేశ్ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఈ నెల 18న జరుగనున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో గుజరాత్తో హైదరాబాద్ తలపడుతుంది.