హిమాయత్నగర్, నవంబర్ 22: సమాజానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు అన్నారు. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు తెలంగాణలో జరిగిన మూడు ఉద్యమాలలో ఆయన కీల క పాత్ర పోషించారని అన్నారు. బూర్గుల నర్సింగరావు జ్ఞాపకాలు, రచనలతో పీపుల్స్ పబ్లికేషన్ హౌజ్ ప్రచురించిన ‘లివింగ్ దోస్ టైమ్స్’ నవచేతన పబ్లికేషన్ హౌజ్ ప్ర చురించిన తెలుగు అనువాదం ‘వెంట వచ్చే ఆ రోజులు’ అనే పుస్తకాల ఆవిష్కరణ సోమవారం హిమాయత్ నగర్లోని మఖ్దూం భవన్లో జరిగింది.
కేంద్ర ప్రణాళిక సం ఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడారు. బూర్గుల నర్సింగ రావు విశాల దృక్పథం కలిగిన వ్యక్తి. ఆయన నాటి నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమంలో జైలు జీవితం గడిపి దాడులను సైతం ఎదుర్కొన్నారని తెలిపా రు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటం, ముల్కీ ఉద్యమం, హైదరాబాద్ అస్థిత్వంపై గాఢమైన అనురక్తి ఉన్న వ్యక్తి బూర్గుల అని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ బూర్గుల వంటి మేధావి, ఉద్యమకారులు, స్వాతంత్య్ర సమరయోధుల అనుభవాలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లోనూ, స్వాతంత్య్ర ఉద్యమ తరం, 1969 ఉద్యమ తరం, 90వ దశక ఉద్యమాలకు వారధిగా బూర్గుల ఉన్నారని, ఆయన తెలంగాణ గర్వించదగిన ముద్దుబిడ్డ అని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కె.ప్రతాప్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, ప్రతినిధులు రామచందర్, సుధాకిరణ్ విమల, మారుపాక అనిల్ కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.