కీసర, మార్చి 1 : మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో మంగళవారం మారుమోగింది. శివభక్తులు కీసరగుట్టకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు స్వామివారికి వేదపండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగాలకు భక్తులు పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీనర్సింహ స్వామి, నాగదేవతా ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు.
కీసరగుట్టలో నేడు..
కీసరగుటలో స్వామికి బుధవారం ఉదయం 5.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,కల్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8గంటలకు తైలాభిషేకం, అన్నాభిషేకం, రాత్రి 9గంటలకు రుద్రస్వాహాకార హోమం, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, నీరాజనం, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమాన రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ యేడు పెరిగిన భక్తుల రద్దీ..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామలింగేశ్వరసామిని దర్శించుకునేందుకు సుమారు 2 లక్షల పైచిలుకు భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వామి దర్శనానికి హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రత్యేక్ష పర్యవేక్షణలో ఈ నెల 27న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 4న ముగియనున్నాయి. భక్తులకు ప్రత్యేక క్యూలెన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు. కీసర నుంచి రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు వచ్చే రోడ్లన్నీ వాహనాలు, భక్తులతో కిటకిటలాడాయి. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ యేడు భక్తుల రద్దీ పెరిగింది. గత సంవత్సరం కరోనా ఉన్న దృష్ట్యా భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. గత సంవత్సరానికి వచ్చిన భక్తుల కంటే రెట్టింపు సంఖ్యలో రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కరోనా తగ్గినప్పటికి ఆలయంలో కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనం కల్పించారు.