ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో రోగులకు సేవలందించడంలో ఆశ కార్యకర్తల నిబద్ధత ఎంతో గొప్పదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. వారు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఆశ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మొబైల్ ఫోన్లను అందజేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా తార్నాక డివిజన్లోని లాలాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆశ కార్యకర్తలకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డితో కలిసి బుధవారం పద్మారావు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.అనంతరం పద్మారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు అండగా ఉంటోందని చెప్పారు. వారిని ప్రోత్సహించడంతో పాటు వేతనాలను కూడా గణనీయంగా పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ మోనిక తదితరులు పాల్గొన్నారు.