ఉజ్వల భవిష్యత్తు ఉన్న నగరం
హైదరాబాద్ నగరం ఈ దేశంలోనే శరవేగంగా ఎదుగుతున్న, ఉజ్వల భవిష్యత్తు ఉన్న నగరమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. భావితరాలకు మెరుగైన హైదరాబాద్ను అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే హరితహారంతో నగరంలో గణనీయంగా పచ్చదనాన్ని పెంచామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మౌలిక వసతుల కల్పన చేపడుతూనే మరోవైపు దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలను కూడా పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
32 పూర్తయ్యాయి
మొదటి దశలో రూ.8,052 కోట్లతో 47 నిర్మాణాలు చేపట్టాం. ఇందులో 32 ప్రాజెక్టులు పూర్తయి, అందుబాటులోకి వచ్చాయి. 16 ఫ్లైఓవర్లు, ఐదు అండర్పాస్లు, ఏడు రోడ్డు ఓవర్, అండర్ బ్రిడ్జిలు, ఒక కేబుల్ స్టేడ్ బ్రిడ్జి, రెండు బ్రిడ్జిల వైడింగ్తో పాటు ఓఆర్ఆర్ నుంచి మెదక్ వరకు ఒక రిహాబులిటీని తీసుకున్నాం.
సీఎం కేసీఆర్ దక్షతకు నిదర్శనం
సియోల్లో జరిగిన వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ పోటీల్లో పారిస్, బొగోటా, మాంట్రియల్ వంటి ప్రపంచంలోని అనేక పట్టణాలను వెనక్కి నెట్టి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు హైదరాబాద్ సొంతం చేసుకున్నది. ఈ అవార్డు రావడం గర్వకారణం. ఇది చిన్న విషయం కాదు.. ప్రపంచ నగరాలతో పోటీపడి.. భారత్ నుంచి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడమంటే సీఎం కేసీఆర్ దక్షత, విజన్కు నిదర్శనం.
“ఎల్బీనగర్ మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా, ఉప్పల్ నుంచి బైరామల్గూడకు వెళ్లాలన్నా, ప్రధాన జంక్షన్గానీ, నాగోల్ జంక్షన్లోగానీ ఎంత గందరగోళ పరిస్థితులు ఉండేవో… ఆరేడేండ్ల కింద ఈ జంక్షన్లలో ట్రాఫిక్లో చిక్కుకుని ఎన్ని గంటలు అవస్థలు పడేవారో నాకంటే మీకే బాగా తెలుసు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకే ఎస్ఆర్డీపీ కింద మొదటి దశలో గ్రేటర్ వ్యాప్తంగా 47 నిర్మాణాలు చేపడితే 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అందులో 17 ప్రాజెక్టులుఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి”.. అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.143.58కోట్లతో నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలోనే శరవేగంగా ఎదుగుతున్న, ఉజ్వల భవిష్యత్తు ఉన్న నగరం హైదరాబాద్ అని స్పష్టం చేశారు. అందుకే భారీ ఎత్తున మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భావితరాలకు మెరుగైన హైదరాబాద్ను అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో.. విస్తరిస్తున్నదో… చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున నగర అభివృద్ధిపై రోజుకో యాంగిల్లో.. అక్కడ అట్లున్నది, ఇక్కడ ఇట్లున్నది అని హైదరాబాద్ ఎంత గొప్పగా విస్తరిస్తుందో చూపిస్తున్నారని అన్నారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.143.58 కోట్లతో నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను బుధవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, కాటేపల్లి జనార్దన్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ విస్తరణ చాలా సంతోషకరమని, ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కూడా జరగాల్సి ఉందన్నారు.
లేకపోతే బెంగళూరులాగా అధోగతిపాలు కావాల్సి వస్తుందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ ముందుచూపుతో.. తన ఆలోచనతో.. 2015లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) చేపట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్ కుమార్, సీఈ దేవానంద్, ఎస్సీ రవీందర్రాజు, కార్పొరేటర్లు అరుణ, పవన్కుమార్, ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, సాగర్రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్గౌడ్, ముద్రబోయిన శ్రీనివాస్రావు, జిట్టా రాజశేఖర్రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్న, పద్మానాయక్, సామ తిరుమల్రెడ్డి, ప్రవీణ్కుమార్, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, లింగాల రాహుల్గౌడ్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, తూర్పాటి చిరంజీవి, జక్కల శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, దూగుంట్ల నరేశ్, సుర్వి రాజు, సతీష్యాదవ్, అనంతుల సురేందర్రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్సీ అశోక్రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ ప్రాంతం మీదుగా హైదారాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా, ఉప్పల్ నుంచి బైరామల్గూడకు వెళ్లాలన్నా, ప్రధాన జంక్షన్గానీ, నాగోల్ జంక్షన్లోగానీ ఎంత గందరగోళ పరిస్థితులు ఉండేవో తనకంటే మీకే బాగా తెలుసు. ఆరేడు సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలోని జంక్షన్లలో ట్రాఫిక్లో చిక్కుకుని ఎన్ని గంటలు అవస్థలు పడేవారో మీకే తెలుసు. అందుకే ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాం.
ఎల్బీనగర్, అక్టోబర్ 26: మరో నాలుగైదు రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు తీపి కబురు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్యలను కూడా పరిష్కరిస్తామని, త్వరలోనే ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి శుభవార్తను చెబుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని చిన్న పొరపాట్ల మూలంగా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల సమస్యలు ఉన్నాయని, వాటిపై గతంలో తాను అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న నేటి హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించానని చెప్పారు. ఈ సమస్య చివరి దశకు వచ్చిందని, నాలుగైదు రోజుల్లోనే ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో ఒక తేదీ అనుకొని సమావేశం పెట్టి జీవో కాపీని మీ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు.
– రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరిస్తాం
ఎల్బీనగర్, అక్టోబర్ 26 : ఇన్నర్ రింగ్రోడ్డులో సాఫీగా, ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణానికి మార్గం సుగమం అయ్యింది. నాగోలు జంక్షన్లో రూ.143 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకురావడంతో ఎక్కడా ఆగకుండా సాఫీ ప్రయాణానికి అడుగులు పడ్డాయి. నాగోలులో ఇరువైపులా ప్రయాణించే ఫ్లై ఓవర్, కామినేని జంక్షన్లో ఇరువైపులా ప్రయాణించేందుకు రెండు ఫ్లై ఓవర్లు , ఎల్బీనగర్ జంక్షన్లో ఇరువైపులా ప్రయాణించేందుకు రెండు అండర్పాస్లు, బైరామల్గూడ జంక్షన్లో రెండువైపులా ప్రయాణించేందుకు రెండు ఫ్లై ఓవర్లు, ఓవైసీ జంక్షన్లో ఒక ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్టలో రెండువైపులా ప్రయాణించేలా ఫ్లై ఓవర్ ఎక్స్టెన్షన్, కాటేదాన్ పాత అండర్ పాస్ల గుండా ఆరాంఘర్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు, తిరిగి ఎయిర్ పోర్టు నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్ పడకుండా రూట్ క్లియర్ అయ్యింది.
రాజకీయాలు అనేవి ఎన్నికల సమయంలో చేద్దామని వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఎన్నికల సమయంలో నువ్వెంత… అనే మాటలు మాట్లాడుకుందామని, అప్పటిదాకా గెలిచిన కార్పొరేటర్లు, ఎవరైనా.. పార్టీలు ఏవైనా అందరం ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్, అక్టోబర్ 26 : విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా చేసిన ఘనత మంత్రి కేటీఆర్దేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ కూడలి ఐదేళ్ల కిందట ఉన్న పరిస్థితికి నేటి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని తెలిపారు. నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై, ఇన్నర్ రింగ్రోడ్డులో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో ప్రజలు సాఫీగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం చూపాలని మంత్రి కేటీఆర్ను కోరారు.