ఆజాదీకా అమృత్ దినోత్సవంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక
ఆర్కేపురం, నవంబర్ 11 : న్యాయ సేవ అనేది ప్రాథమిక హక్కు అని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి రేణుక పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, మహాత్మాగాంధీ లా కళాశాలలో రాష్ట్ర స్థాయి నమూనా కోర్టు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయసేవా అధికార సంస్థ అర్హులైన వారికి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పలు చట్టాలపై అవగాహన సదస్సులు ఉచితంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నమూనా కోర్టు పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను జాతీయ స్థాయిలో జరిగే నమూనా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మురళీకృష్ణ, క్రిమినల్ కోర్టు కార్యదర్శి రాధిక జైస్వాల్, మహాత్మాగాంధీ లా కళాశాల కార్యదర్శి గంగుల గోవర్దన్రెడ్డి, ప్రిన్సిపాల్ డా.శ్రీనివాస్, రాష్ట్రంలోని వివిధ లా కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.